ముందుగానే చూసి.. రెట్టింపు బెట్టింగ్
పంటర్లను గందగోళంలో పడేసే ప్లాన్
సాయిరాం వర్మ ైస్టెలే డిఫరెంట్
యానాంలో అడ్డా.. వనస్థలిపురంలో పందెం
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
రూ. 56 లక్షల సొత్తు స్వాధీనం
సిటీబ్యూరో, ఏప్రిల్ 6: పుదుచ్చేరి కేంద్రంగా హైదరాబాద్లో క్రికెట్ బెట్టింగ్ను నిర్వహిస్తున్న ఓ ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ క్యాంపు కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఏపీకి చెందిన సాయిరాం వర్మ పుదుచ్చేరిలోని యానాంలో అడ్డా ఏర్పాటు చేసుకోగా, నగరంలోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన తన్నీరు నాగరాజు.. సాయిరాం నుంచి లైన్ తీసుకొని.. క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న ఎల్బీనగర్ ఎస్వోటీ అంజిరెడ్డి బృందం వనస్థలిపురంలోని నాగరాజు నివాసంలో సోదాలు జరిపి.. రాజస్థాన్ రాయల్స్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్పై భారీగా బెట్టింగ్లను నిర్వహించినట్లు గుర్తించారు.
నాగరాజు నుంచి రూ. 11 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ల్లో ఉన్న మూడు ఖాతాల్లో రూ. 31.17 లక్షలను ఫ్రీజ్ చేశారు. కారు, మూడు బైక్లు, 9 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నాగరాజుతో పాటు గుండు కిశోర్, తన్నీరు అశోక్, చెమ్మెటీ వినోద్, కోట్ల దినేశ్ భార్గవ్, మేడిశెట్టి కిశోర్, బోజన రాజులను అరెస్టు చేశారు. పుదుచ్చేరిలో ఉన్న ప్రధాన సూత్రధారులు సాయిరాం వర్మ, రోమన్ క్యాథలిస్టు కుల్మాడి స్వామి పరారీలో ఉన్నారు. నాగరాజు గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో అరెస్టయ్యాడు.
ఇలా సాగుతుంది..
పుదుచ్చేరిలో ఉన్న సాయిరాం వర్మ నుంచి లైన్ తీసుకున్న నాగరాజు.. తన బంధువులు అశోక్, వినోద్లను జత కలుపుకొన్నాడు. మరో బంధువు కిశోర్ను ఈ ఐపీఎల్ సీజన్లో సాంకేతికంగా సహకరించేందుకు రూ. 5 లక్షలు చెల్లించి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చాడు. వినోద్ ఇంట్లో బెట్టింగ్ దందా మొదలుపెట్టాడు. నాగరాజు తనకు తెలిసిన పంటర్లకు యూజర్నేమ్, పాస్వర్డు ద్వారా లింక్లను ఇస్తున్నాడు. ఇప్పటివరకు 14 లింక్లను సాయిరాం వర్మ నుంచి తీసుకొని.. నాగరాజు వాటిని పంటర్లకు ఇచ్చాడు. సాయిరాం వర్మ ప్రతి మ్యాచ్లో 3 బంతుల తర్వాత బెట్టింగ్లను ప్రారంభిస్తాడు. మూడు బంతులు అయిపోయాక.. ఈ బాల్లో వికెట్ పడుతుందని ఆఫర్ పెడుతాడు. పడితే ఒక బెట్టింగ్ రేట్….పడకపోతే ఇంకో రేట్ ఫిక్స్ చేస్తాడు. అయితే సాయి రాంకు ముందే ఆ బాల్ అంశం తెలిసిపోవడంతో అతడికి అనుకూలంగా ఉండే దానిపై బెట్టింగ్ రేటింగ్ను అధికంగా, మిగతా దానిపై తక్కువగా పెడుతాడు. ఇలా పంటర్లను గందరగోళానికి గురి చేసి భారీగా బెట్టింగ్లను రాబడుతున్నాడని తేలింది. లింక్లు తీసుకున్న వారందరూ మ్యాచ్లు అయిపోయే వరకు లైవ్లోనే బెట్టింగ్లను కడుతున్నారు. నాగరాజు మూడు శాతం కమీషన్ తీసుకుని మిగతా నగదును సాయిరాంకు పంపిస్తున్నాడు.
పాసుపోర్టు రాదు..
క్రికెట్ బెట్టింగ్ మోజులో పడి యువత తమ భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని సీపీ చెప్పారు. ఈ కేసుల్లో పట్టుబడితే.. పాస్పోర్టులు, ప్రభుత్వ ఉద్యోగాలు రావని హెచ్చరించారు.