సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాచకొండ కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను బుధవారం నాగోల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పోలీస్ కమిషనర్ సుధీర్బాబు విడుదల చేశారు. కేసుల నమోదు సంఖ్య పెరిగినా, నేరస్తులకు శిక్షలు వేయించడంలో తెలంగాణలోనే మొదటి స్థానంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉందని, ఇది వరుసగా ఐదో సంవత్సరమని సీపీ సుధీర్బాబు వెల్లడించారు.
కేసుల నమోదు సంఖ్య పెరిగినా, నేరస్తులకు శిక్షలు వేయించడంలో తెలంగాణలోనే మొదటి స్థానంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఉన్నదని, ఇది వరుసగా ఐదో సంవత్సరమని పోలీస్ కమిషనర్ సుధీర్బాబు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ 2023 వార్షిక నివేదికను ఆయన బుధవారం నాగోల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజా భద్రతే లక్ష్యంగా కమిషనరేట్ పోలీస్ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ అనేది కనిపించకుండా ఉండాలని ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు డ్రగ్స్పై తాము యుద్ధం చేస్తున్నామన్నారు. ఈ ఏడాది కన్విక్షన్ రేట్ 61 శాతం పెరిగిందన్నారు. విచారణలో ఉన్న 36,126 కేసుల్లో 75 శాతం పరిష్కరించామన్నారు. నేషనల్ లోక్ అదాలత్లో 8,981 కేసులు పరిష్కరించమని సీపీ వెల్లడించారు. మహిళా భద్రత, సైబర్క్రైమ్ నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, బాల్య వివాహాలను కట్టడి చేస్తామని సీపీ వివరించారు. ఈ ఏడాది అక్రమ వ్యవహారాలు నిర్వహిస్తున్న 299 కేంద్రాలను మూసివేయడంతో పాటు 177 బాల్య వివాహాలను నిలిపివేశామన్నారు. సాంకేతికతను అప్డేట్ చేసుకుంటూ ప్రజలకు వేగంగా సేవలందిస్తామన్నారు. రాచకొండ కమిషనరేట్లో విజుబుల్ పోలీస్, క్విక్ రెస్పాన్స్తో ప్రజలకు వేగంగా సేవలందిస్తామన్నారు. ఒత్తిడి లేకుండా సిబ్బంది పనిచేస్తూ, ప్రజలకు పారదర్శకంగా సేవలను వేగంగా అందించే లక్ష్యంతో ముందుకెళ్తామన్నారు.
ఈ ఏడాది ప్రధాన కేసులు..
గత ఏడాది 25,815 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 27,586 కేసులు నమోదయ్యాయి. 6.8 శాతం నేరాలు పెరిగాయని సీపీ వెల్లడించారు. సైబర్నేరాలు 2022లో 2,049 నమోదు కాగా.. ఈ ఏడాది 2,562 నమోదై.. 25 శాతం నేరాలు పెరిగాయన్నారు. శిక్షల శాతం 2022లో 59 శాతం ఉండగా, 2023లో 61 శాతానికి పెరిగిందన్నారు. 5882 కిలోల గంజా, 6.5 లీటర్ల హాష్ ఆయిల్, 262 గ్రాముల ఎండీఎంఏ, 4.5 కిలోల ఓపియం, 377 గ్రాముల హెరాయిన్, 9.2 కిలోల పప్పీ స్ట్రా, 37 ఎక్సటెసీ పిల్స్, 4 ఎల్ఎస్డీ పేపర్లు, 150 నిటర్విత ట్యాబ్లెట్స్.. తదితర డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో 62.6 కోట్ల నగదు, 15.3 కిలోల బంగారం, 21.4 కిలోల వెండి, 300 క్యారెట్ల డైమాండ్స్ను సీజ్ చేసినట్లు వివరించారు. కమిషనరేట్లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్.. ఆపై స్థాయి అధికారులందరూ ఈ సమావేశానికి హాజరయ్యారు. డీసీపీలు జానకీ, సాయి శ్రీ, అనురాధ, రాజేశ్ చంద్ర, శ్రీనివాస్, గిరిధర్, మురళీధర్, శ్రీనివాస్తో పాటు పలువురు అధికారులు ఉన్నారు.