మన్సూరాబాద్, జనవరి 9: ఈవ్ టీజర్ల పట్ల కఠినంగా వ్యవహరించడంతో పాటు మహిళలు, యువతుల భద్రతకు పెద్దపీట వేసే విధంగా షీ టీమ్స్ బృందాలు పని చేయాలని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ సూచించారు. ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంప్ కార్యాలయం ప్రాంగణంలోని షీ టీమ్స్ కార్యాలయాన్ని సోమవారం సీపీ సందర్శించారు. షీ టీమ్స్ సిబ్బందితో ఆయన మాట్లాడి, వారి పనితీరును తెలుసుకున్నారు. డీసీపీ, షీటీమ్స్ ఇన్చార్జి సలీమా, షీ టీమ్స్ ఏసీపీ ఎస్. వెంకట్రెడ్డితో పాటు షీటీమ్స్ బృందంలోని 300 మంది సిబ్బందితో సీపీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. మహిళలు, బాలికల భద్రత కోసం 2023లో చేపట్టనున్న కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. ఏడో తరగతి నుంచి విశ్వవిద్యాలయం స్థాయి వరకు అన్ని విద్యా సంస్థల్లోనూ విద్యార్థులకు సైబర్ నేరాలు, మోసాలు, జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు.
విద్యార్థుల భాగస్వామ్యంతో..
కళాశాల విద్యార్థుల కోసం భవిష్యత్తులో ‘ఆమె’ అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి కళాశాల నుంచి ఇద్దరు చురుకైన బాలికలను గుర్తించి, ఆమె కోసం ఆమె నిర్వహించాల్సిన బాధ్యతలపై షీటీమ్స్ అవగాహన కల్పిస్తుందన్నారు. మహిళలు, యువతుల భద్రత కోసం నిరంతరం గస్తీ, డెకాయ్ ఆపరేషన్స్ నిర్వహిస్తామన్నారు. షీటీమ్స్ ప్రత్యేక బృందాలు గత మూడు రోజుల్లో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి 50 మంది ఈవ్ టీజర్లను పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
అన్ని ప్రాంతాల్లో 24×7 భద్రత..
సైబర్ స్టాకింగ్ను అరికట్టడానికి సమగ్ర కార్యాచరణ రూపొందించాలని షీటీమ్స్ ఇన్చార్జికి సూచించారు. మహిళలు, యువతుల భద్రత కోసం షీటీమ్స్ చేపడుతున్న కార్యక్రమాలపై విద్యాసంస్థల్లో చదివే యువతులు, ఉద్యోగాలు చేసే, కాలనీల్లో నివసించే మహిళలకు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సమయంలో పోలీసులను ఎలా సంప్రదించాలనే అంశాన్ని తెలియజేయాలని తెలిపారు. యువతులు, బాలికలు నివాసముండే వసతి గృహాలు, హాస్టళ్లు, మహిళా హాస్టళ్లు, పెయింగ్ గెస్ట్ల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా యాజమాన్యాలకు సెక్యురిటీ కమాండ్లను నిర్వహిస్తామన్నారు.
మహిళలు, యువతులు ఉండే హాస్టళ్లు తదితర గృహాల్లోని కాంపౌండ్ వాల్స్ 5 అడుగుల ఎత్తు కంటే ఎక్కువగా ఉండే విధంగా సదరు యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణతో పాటు అక్కడికి వచ్చే సందర్శకుల పేర్లను రిజిస్టర్ చేయాలని తెలిపారు. బాలికలు, మహిళల భద్రత కోసం షీటీమ్స్ 24X7 పని చేయాలని, బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ మొబైల్స్ను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. మహిళల భద్రత, శాంతియుత సమాజాన్ని నెలకొల్పేందుకు షీటీమ్స్ చేస్తున్న కృషిని సీపీ డీఎస్ చౌహాన్ అభినందించారు.