సిటీబ్యూరో, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రజా జీవితానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనులు చేసే రౌడీలు, గుండాల కార్యకలాపాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి హెచ్చరించారు. క్రిమినల్ ప్రొసిజర్ కోడ్లోని సెక్షన్ 107 మేరకు బుధవారం బంజారాహిల్స్ ఐసీసీసీలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం కోర్టును నిర్వహించారు. ఈ కోర్టులో ఆయన అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఎగ్జిక్యూటివ్)గా మారి, రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించిన ముఠాల మధ్య ఆదిపత్య పోరులో దాడులు, ప్రతి దాడులతో గ్యాంగ్వార్కు పాల్పడుతున్న అంశాలను ప్రస్తావిస్తూ.. ఆయా కేసులను విచారించారు. ఇందులో భాగంగా కాలాపత్తార్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే రౌడీషీటర్లు మహ్మద్ షాన్వాజీ ఘాజీ, మైలార్దేవ్పల్లికి చెందిన మహ్మద్ ఆర్ఫాజ్ ముఠాల మధ్య గ్యాంగ్వార్ నడుస్తున్నది.
ఈ ఆదిపత్య పోరులో ఒక ముఠాపై మరో ముఠా దాడులు చేయడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు గ్యాంగ్లను పోలీస్ కమిషనర్ కోర్టుకు పిలిపించారు. రౌడీయిజం, గ్యాంగ్వార్తో జరిగే అనర్థాలను వివరిస్తూ.. రెండు ముఠాల మైండ్సెట్ మార్చుకోవాలని మందలించారు. భవిష్యత్లో ఇలాంటి వ్యవహారాలను ఉపేక్షించమని హెచ్చరిస్తూ.. విచారణ వాయిదా వేశారు. అలాగే, బంజారాహిల్స్ ఠాణా పరిధికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ మాజీద్, ఆసీఫ్నగర్ ఠాణా పరిధికి చెందిన రౌడీషీటర్ సయ్యద్ ఎజాజ్ ముఠాల మధ్య పోరు కొనసాగుతున్నది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఆయా ఠాణాలలో కేసులు నమోదయ్యాయి. ఈ ముఠాను కూడా సీపీ మందలించి, ప్రవర్తన మార్చుకోవాలని సూచిస్తూ విచారణ వాయిదా వేశారు. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. భవిష్యత్లో ఈ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అధికారాలను వినియోగిస్తామని సీపీ శ్రీనివాస్రెడ్డి తెలిపారు.