సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్థవంతంగా పనిచేయగలుగుతారని, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, తోటి వారితో ఆనందంగా జీవనం గడుపుతారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేసే సిబ్బంది సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత సిటీ పోలీస్ బాస్గా తనదేనని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
హైదరాబాద్ పోలీసులు నిరంతరం ఆరోగ్యకరంగా ఉండాలనే లక్ష్యంతో సిబ్బంది హెల్త్ ప్రొఫైల్, ఆరోగ్య సేవల కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన ‘ఫిట్ కాప్’ యాప్ను బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని ఆడిటోరియంలో సీపీ సీవీ ఆనంద్తో కలిసి ఆయన సతీమణి లలితా ఆనంద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సమావేశానికి హైదరాబాద్ పోలీస్ సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో సహా హాజరయ్యారు. ఈ సందర్భంగా లలితా ఆనంద్ మాట్లాడుతూ.. డయాబెటిక్ నుంచి మొదలు అన్ని రకాల వ్యాధులకు సంబంధించి సిబ్బంది హెల్త్ ప్రొఫైల్ కోసం పుణేకు చెందిన హెల్త్ కేర్ ప్రొవైడర్ సంస్థ సహకారంతో ఈ యాప్ను తయారు చేయించినట్లు తెలిపారు.
పోలీస్ విధుల గూర్చి అవగాహన ఉండటంతో సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఈ ఆరోగ్య యాప్ను రూపొందించాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు. ఆరోగ్యకరమైన ఆహారం అలవాట్లు చేసుకోవాలని సూచించారు. ఇందుకు పోలీసు అధికారుల జీవిత భాగస్వాములు అన్ని విధాలుగా వారికి మద్దతు ఇవ్వాలని కోరారు. పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చి నెలలో హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్తో సిటీ పోలీస్ హెల్త్కు సంబంధించిన సర్వేపై ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వెస్ట్జోన్లోని అన్ని పోలీస్ స్టేషన్లలో సర్వే నిర్వహించగా.. 60 శాతం సిబ్బంది వివిధ రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తేలిందన్నారు. దీంతో ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించాలని భావించి, యాప్ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
హెల్పింగ్ హ్యాండ్ ఇచ్చిన రోడ్ మ్యాప్ ఆధారంగా.. యాప్లో సిబ్బంది ఆరోగ్యానికి సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. వైద్యులు, డైటీషియన్స్, ఫిజికల్ ట్రైనర్స్, కౌన్సిలర్లు ఈ యాప్ సహాయంతో అవసరాన్ని బట్టి మాట్లాడటం, చాటింగ్ చేసేందుకు వీలు ఉన్నదన్నారు. ప్రతి రోజు సిబ్బంది చేసే శారీరక వ్యాయామం కూడా ఈ యాప్లో నమోదవుతుందని, ఉన్నతాధికారులు నిరంతరం పరిశీలిస్తుంటారని చెప్పారు. సిబ్బంది ఆరోగ్యంగా ఉన్నప్పుడే పనిలో సమర్థవంతంగా రాణిస్తారని అన్నారు. సిటీ పోలీస్ బాస్గా సిబ్బంది సంక్షేమం చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదని సీపీ చెప్పారు. ఈ యాప్ బీటా టెస్టింగ్లో 1300 మంది పాల్గొన్నారని, అందులో ఉన్న హోంగార్డులు పేరయ్య, బ్రహ్మ నాయుడు, కానిస్టేబుల్ పద్మను సీపీ అభినందించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యానికి సంబంధించిన పరికరాల సంస్థలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, మెడికల్ ఎక్స్పర్ట్స్, థెరపిస్టులతో పాటు హెల్త్ ఇన్సూరెన్స్కు సంబంధించిన ఎక్స్పో కూడా నిర్వహించారు. జాయింట్ సీపీ రమేశ్, షీ టీమ్స్ అదనపు సీపీ శిరీష రాఘవేంద్ర, ఐటీ సెల్ సీఐ రాఘవేంద్రతోపాటు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ప్రతినిధి ముజ్తాబ్ ఆస్కరీని సీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీలు విక్రమ్ సింగ్ మాన్, ఏఆర్ శ్రీనివాస్, జాయింట్ సీపీలు విశ్వప్రసాద్, ఎం.రమేశ్, కార్తికేయ, ఏవీ రంగనాథ్, గజారావు భూపాల్, తదితర అధికారులు పాల్గొన్నారు.