సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): గణేశ్ నవరాత్రులు, నిమజ్జనాల సందర్భంగా ప్రతి రోజు రాత్రి పోలీసు అధికారులు గణేశ్ మండపాల వద్ద తప్పనిసరిగా బందోబస్తును పర్యవేక్షించాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం అర్ధరాత్రి తరువాత ఆయన ఓల్డ్సిటీలోని హుస్సేనీ ఆలం, కామాటిపురా, మొఘల్పురా తదితర పోలీస్స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన గణేశ్ మండపాలను సందర్శించారు. అక్కడ బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి, మండపాల నిర్వాహకులతో మాట్లాడారు.
పాయింట్ పుస్తకాలలో సంతకాలు చేశారు. వినాయక నిమజ్జనాలు పూర్తయ్యే వరకు అధికారులు రాత్రి వేళల్లో బందోబస్తులో పాల్గొంటూ మండపాల వద్ద వివరాలు సేకరిస్తూ ప్రజల భద్రతకు మేమున్నామనే భరోసానివ్వాలని సూచించారు. అలాగే హుస్సేన్సాగర్ పరిసరాలలో నిమజ్జనానికి తరలివచ్చే విగ్రహాల ర్యాలీలను పరిశీలిస్తుండాలని, తెల్లవారుజాము వరకు ఈ ర్యాలీలు కొనసాగుతుండటంతో ప్రతి ఒక్క అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.