సిటీబ్యూరో, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): అగ్ని మాపకశాఖ నియమాలు పాటిస్తూ.. ప్రమాదాలు జరగకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి సూచించారు. జాతీయ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలు, గోడ ప్రతులను సీపీ అవినాశ్ మహంతి తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ‘అగ్ని భద్రతను నిర్ధారించండి-దేశాభివృద్ధికి సహకరించండి’.. అనే థీమ్తో ఈ సంవత్సరం అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఎక్కడైనా అగ్ని ప్రమాదాలు జరిగితే, వెంటనే 101 నంబర్కు సమాచారమివ్వాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా ఫైర్ అధికారి ఎస్.శ్రీధర్ మాట్లాడుతూ.. ఎక్కువగా వేసవిలో కిచెన్, గోడౌన్లలో అగ్నిప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అగ్ని ప్రమాదాలు, నివారణ చర్యలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. విద్యుత్ షార్ట్సర్క్యూట్, వంట గ్యాస్ వంటి వాటి వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. అందుకే దవాఖానలు, పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, మాల్స్, కర్మాగారాలు తదితర ప్రదేశాల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.