సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీసు కుటుంబం వ్యాక్సిన్ తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీ మహేశ్ భగత్ కోరారు. ఫ్రంట్లైన్ వారియర్స్గా పని చేస్తున్న పోలీసు అధికారులు సురక్షితంగా ఉండాలంటే వారి కుటుంబ సభ్యులు టీకా తీసుకోవాలని కోరారు. ఇందుకోసం కమిషనరేట్ పరిధిలో వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సినేషన్ను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.ఇప్పటి వరకు 2720 కుటుంబాలు వ్యాక్సిన్ తీసుకున్నాయని.. వారం రోజుల్లో మిగతా వారు తీసుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.
బంజారాహిల్స్: పోలీసుల కుటుంబాల కోసం బైజూస్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ రోడ్ నం.2లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సీపీ అంజనీకుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలన్నారు. సీఎస్ఆర్ కింద బైజూస్ ఇలాంటి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. అదనపు సీపీ శిఖా గోయల్, బైజూస్ ప్రతినిధులు ఆదిష్, అతుల్ సింగ్ పాల్గొన్నారు.