కరోనా నియంత్రణకు ప్రభుత్వం లాక్డౌన్ విధించగా, ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మినహాయింపు ఇచ్చింది. నిత్యావసరాలు, కూరగాయలు, ఇతరాత్ర కొనుగోలు చేసుకునేందుకు సడలింపు కల్పించింది. అయితే చాలామంది హడావుడిగా పరుగులు తీస్తూ ముప్పును ‘కొని’ తెచ్చుకుంటున్నారు. టైం అయిపోతుందనే తొందరలో వైరస్ బారిన పడుతున్నారు. ఓ పక్క వాచీ, సెల్ఫోన్ చూసుకుంటూ పరుగులు తీస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రణాళిక లేకుండా బయటకెళ్లి ఇబ్బందులు పడుతూ ఇంటికి చేరుతున్నారు. ప్రతిరోజు బయటకెళ్లకుండా అన్ని పనులను ఒకేసారి పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాలి. ఇంట్లో అందరూ కాకుండా ఒక్కరే బయటకెళ్లడం ఉత్తమం. మార్కెట్లు, దుకాణాలు, షాపింగ్ మాల్స్, మందుల దుకాణాలు, మద్యం షాపులు నాలుగు గంటలపాటు కిక్కిరిసి ఉండటంతో మాస్క్ ధరించి దూరం పాటిస్తూ జాగ్రత్తగా కొనుగోలు చేయాలి.
కొవిడ్ -19 వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం ఉదయం 6నుంచి 10 గంటల వరకు ప్రజా అవసరాల కోసం సడలింపు ఇచ్చింది. ఈ 4 గంటల సమయంలో కుటుంబానికి కావాల్సిన నిత్యావసర సరుకులు, మందులు కొనుగోలు చేయడంతో పాటు ఇతర పనులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునేందుకు సరైన ప్రణాళిక అవసరం. ప్రణాళిక లేకుండా బయటకు కొందరు పరుగులు పెడుతూ.. సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అనవసరమైన ఉరుకులు, పరుగులతో ఉపద్రవాన్ని కొని తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు.
మార్కెట్లో కూరగాయలు, పండ్లు కొనుగోలు చేశాక.. వాటిని అలానే ఉపయోగించకూడదు. మొదటగా వాటిని గోరువెచ్చని ఉప్పు నీళ్లలో వేయాలి. లేదా డిటెర్జెంట్ నీటితో వాటిని శుభ్రం చేయాలి. అనంతరం వాటిని ఫ్రిజ్లో పెట్టాలి. మిల్క్ ప్యాకెట్స్ను సబ్బుతో కడగాలి.
లాక్డౌన్ సమయంలో కుటుంబమంతా ఇంట్లోనే కాలక్షేపం చేయాలి. టీవీ వీక్షణం, ఆట పాటలు, పుస్తక పఠనం, రుచికరమైన పిండి వంటలు, దైవ చింతన, మొదలైన వంటి వాటితో ఇల్లే సర్వస్వంగా గడపాలి. చిన్నారులు తల్లిదండ్రుల పర్యవేక్షణలో చిత్రలేఖనం, సైక్లింగ్ ప్రాక్టీసు చేయాలి.
వీలైనంత వరకు లిఫ్ట్ వినియోగించకపోవడమే మంచిది. లిఫ్ట్ వాడాల్సి వస్తే చేతులతో లిఫ్ట్ కీ ప్యాడ్ ముట్టకూడదు. వెంట తీసుకెళ్లిన ఏదైనా పేపర్ సహాయంతో చేతిని కవర్ చేసుకుని పుష్ బటన్ నొక్కాలి. బయటకు వచ్చాక వెంటనే ఆ పేపర్ను రెండో వైపు తాకకుండా డస్ట్బిన్లో వేయాలి.
ఇంటికి వెళ్లిన అనంతరం, వెంటనే తలుపులను ముట్టుకోకుండా కుటుంబ సభ్యులను పిలిచి డోర్ తెరిపించాలి. వెంట తీసుకెళ్లిన సామగ్రిని ఏదైనా ప్రత్యేక ప్రాంతంలో ఉంచాలి. వాష్రూంకు వెళ్లి కనీసం 20సెకన్ల పాటు చేతులు, ముఖాన్ని సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. వీలైతే స్నానం చేయడం ఇంకా మంచిది. ధరించిన బట్టలను డిటర్జెంట్ వాటర్లో నానబెట్టాలి. పాదరక్షలను పరిశుభ్రంగా కడుక్కోవాలి.