ఇబ్రహీంపట్నంరూరల్, జూన్ 9 : రైతును రాజుగా చూడాలన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతుబీమా, పంటలకు బీమా, సబ్సీడీ విత్తనాలు, ఎరువులు అందజేయడంతో పాటు రైతులు తమ సమస్యలను చర్చించుకుని సాగులో నూతన విధానాలను ఆచరించడానికి ప్రతి క్లస్టర్కు ఒక రైతువేదికను నిర్మించారు. రైతువేదికల ద్వారా నియోజకవర్గంలో బుధవారం నుంచి పూర్తిస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు సేవలందిస్తున్నారు. దీంతో రైతులు మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా రైతు వేదికలను సంప్రదించాలని వ్యవసాయాధికారులు సూచించారు.
విస్తరణ అధికారులు రైతువేదికల్లోనే విధులు : ఏడీఏ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం
రైతులకు వ్యవసాయాధికారులు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం రైతు వేదికల్లోనే వ్యవసాయ విస్తరణ అధికారులు విధులు నిర్వహించనున్నారు. పంటలకు ఎలాంటి చీడపీడలు సోకినా, కొత్త సాగు వివరాలు తెలసుకోవాలన్నా రైతులు ఇకపై మండల వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేదు. అన్నదాతకు అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో విధులు నిర్వహిస్తున్న ఏఈవోలను సంప్రదించాలి. డివిజన్లోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, మాడ్గుల, మండలాల్లో పూర్తిగా రైతువేదికలు సేవలు అందింస్తున్నాయి.