న్యూఢిల్లీ, జూన్ 29 : రెండు మహాసముద్రాలు పలు ప్రపంచ దేశాల్లో కోట్ల మందిని అతలాకుతలం చేస్తున్నాయి. ఒకటి అట్లాంటిక్ మహా సముద్రం కాగా, రెండోది పసిఫిక్ మహాసముద్రం. కొన్ని వేల కిలోమీటర్ల దూరం ఉన్న ఈ రెండు మహాసముద్రాలు వాతావరణంలో మార్పులకు కారణమవుతున్నాయి. వేడెక్కుతున్న అట్లాంటిక్ మహాసముద్రం కారణంగా ఐరోపా, ఉత్తర అమెరికా ఖండాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతన్నాయి. మరోవైపు పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న ఎల్ నినో కారణంగా భారతదేశంలో నైరుతి రుతుపవనాలకు అవాంతరం ఏర్పడుతున్నది. దీంతో దేశంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొని ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనట్టి కరువు పరిస్థితులకు దారితీస్తున్నది. దీంతో న్యూఢిల్లీ నుంచి న్యూయార్క్ వరకు విస్తరించిన ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులకు ఈ రెండు మహాసముద్రాలు కారణమవుతున్నాయి.
వేడెక్కుతున్న అట్లాంటిక్ మహాసముద్రం కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఐరోపా ఖండంలో వడగాలులు వీయడమే కాకుండా స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటుతున్నాయి. ఈ వాతావరణ ధోరణి పశ్చిమ దిశగా విస్తరిస్తున్నదని, దీంతో ఉష్ణ గుమ్మటాలు బలపడి అమెరికాలో సైతం రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిరంతరం అధిక వాతావరణ పీడనం ఉండే ప్రాంతంలో భూ ఉపరితలం దగ్గర వేడి గాలులను బంధించినప్పుడు ఉష్ణగుమ్మటం ఏర్పడుతుందని వారు వివరించారు. ఆ సమయంలో దిగువకు వీచే గాలి సంకోచించి వేడెక్కుతుందని, అదే సమయంలో ఆకాశం నిర్మలంగా మారడంతో సూర్యరశ్మి నేలను దహించి వేస్తుందని తెలిపారు.

పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్ నినో కారణంగా ఉష్ణమండల ప్రాంతా ల్లో వాతావరణ ప్రసరణ మారిపోతున్నది. దీనివల్ల సాధారణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి భారత ఉపఖండంలోకి తేమను తీసుకొచ్చే రుతుపవన గాలులు బలహీనపడుతున్నాయని వివరించారు. ఇప్పటికే ఆలస్యమైన రుతుపవనాలు, ఇంకా నెమ్మదిగా కదులుతుండటంతో జూన్ నెలలో 42% లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. రుతుపవనాలు ఇంకా కనుమరుగు కాలేదని, కానీ వాటి వేగం తగ్గిపోయిందని అంటున్నారు. ఎల్ నినో కారణంగా భూమధ్యరేఖను దాటి వీచే గాలులు తగ్గిపోయాయని, దీంతో మేఘాలు ఏర్పడటం లేదని ఫలితంగా వాతావరణంలో వర్షాలను కురిపించే వ్యవస్థలు ముందుకు సాగడం లేదని తెలిపారు. ఈ ప్రభావంతో దేశంలో రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోతున్నదని, ఢిల్లీ వంటి ఉత్తర భారత నగరాలు అధికకాలం వడగాలులను ఎదుర్కొంటున్నాయని వివరించారు. అట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ ఆ రెండూ వేడెక్కుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా స్పందిస్తున్నాయని అంటున్నారు. పెరుగుతున్న సముద్ర ఉష్ణోగ్రతలు వాతావరణంతో జరిగే ఉష్ణ, తేమ వినిమయాల పరిమాణాన్ని పెంచి, ఇప్పటికే తీవ్రంగా ఉన్న వాతావరణ సరళిని తీవ్రతరం చేస్తున్నాయని వివరించారు. దీంతో ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాలోని వందల కోట్ల మంది ప్రజలు ప్రభావితమవుతున్నారని పేర్కొన్నారు.