హైదరాబాద్ : చిట్టీల పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన దంపతులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాలిబండ పోలీసు స్టేషన్ పరిధిలోని అలియాబాద్కు చెందిన మధు, దివ్య గత ఆరేండ్ల నుంచి చిట్టీల వ్యాపారం కొనసాగిస్తున్నారు.
అయితే గతేడాది చిట్టీ కాలం పూర్తయిన తర్వాత కూడా డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులంతా కలిసి శాలిబండ పోలీసులకు 11 నెలల క్రితం ఫిర్యాదు చేశారు. సుమారు 70 మంది వద్ద రూ. 5.5 కోట్లు వసూలు చేశారని బాధితులు పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని పలు సందర్భాల్లో బాధితులు సీసీఎస్ ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కేసులో ఎట్టకేలకు మధు, దివ్య దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.