బంజారాహిల్స్, డిసెంబర్ 9: తీసుకున్న అప్పును చెల్లించలేదన్న కక్షతో భార్యాభర్తలను హత్య చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను ఫిలింనగర్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ పీఎస్ పరిధిలోని సత్యకాలనీ పయనీర్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న సయ్యద్ అహ్మద్ ఖాద్రీ(42) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. అతడి భార్య సయీదా మిరాజ్ ఫాతిమా(40) బంజారాహిల్స్లోని రెయిన్బో ఆస్పత్రిలో డైటీషియన్గా పనిచేస్తుంటుంది. ముంబయి నుంచి వచ్చి నదీమ్ కాలనీలో మేకల వ్యాపారం నిర్వహిస్తున్న మహ్మద్ అస్ఘర్ షేక్(35) అనే వ్యక్తి మేకల పెంపకం మీద యూట్యూబ్లో వీడియోలు చేస్తుంటాడు. అతడి వీడియోలు చూసిన అహ్మద్ ఖాద్రీ తనకు నగర శివారులో పొలం ఉందని, అక్కడ మేకల ఫామ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నానని పరిచయం చేసుకున్నాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం కుదిరింది.
మేకల ఫామ్ ఏర్పాటు చేసేందుకు తాను స్థలం ఇస్తానని, ఫామ్ ఏర్పాటుకోసం అవసరమయ్యే డబ్బులు అస్ఘర్షేక్ సమకూర్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఫామ్ ఏ ర్పాటు కోసం సుమారు రూ.20లక్షల దాకా ఖాద్రీ తీసుకున్నాడు. అయితే నెలలు గడిచినా ఫామ్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు తనవద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అతడిని చంపేయాలని అస్ఘర్ షేక్ నిర్ణయించుకున్నాడు. దీనికోసం ముంబయికి చెందిన సమీర్(30) అనే యువకుడితో పాటు మణికొండలో నివాసం ఉంటున్న సల్మాన్తో కలిసి ప్రణాళిక రూపొందించి గత నెల 28న అహ్మద్ ఖాద్రీని నదీం కాలనీలోని తమ మేకల ఫామ్కు పిలిపించి దారుణంగా హత్య చేశారు.
అహ్మద్ ఖాద్రీని హత్య చేసిన నిందితులు పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేశారు. ఖాద్రీని హత్య చేసిన అనంతరం నదీమ్ కాలనీలోని చెరువు పక్కన భారీ గొయ్యి తీసి మృతదేహాన్ని పాతిపెట్టారు. మృతుడి సెల్ఫోన్ను తమవద్దే ఉంచుకుని గోల్కొండ తదితర ప్రాంతాల్లో తిరగడంతో పాటు మరుసటిరోజు మధ్యాహ్నం డ్యూటీలో ఉన్న ఖాద్రీ భార్య ఫాతిమాకు మెసేజీలు చేశారు. తాను బిజీగా ఉన్నానని, కాసేపట్లో ఇంటికి వెళ్తున్నానని భర్త పేరుతో వచ్చిన మెసేజీలు చూసిన ఫాతిమా సాయంత్రం 5.30 ప్రాంతంలో ఇంటికి వచ్చింది. అప్పటికే ఖాద్రీ వద్ద తీసుకున్న ఇంటి తాళంతో లోనికి వెళ్లిన ముగ్గురు దుండగులు ఫాతిమా ఇంట్లోకి రాగానే ఆమె మెడకు చున్నీ బిగించి దారుణంగా హత్య చేశారు. మృతదేహాన్ని ఓ మూలకు లాగేసి ఇంట్లోని బట్టల మూటలు మీద వేశారు. ఇంట్లోని గ్యాస్స్టవ్ను ఆన్చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఎవరైనా వచ్చి లైట్ వేస్తే మంటలు చెలరేగి ఫాతిమా మృతదేహం కాలిపోతుందని భావించారు. ఖాద్రీ సెల్ఫోన్ను రెండ్రోజుల పాటు వాడి చెరువులో పారేశారు.
ఇదిలా ఉండగా తమ చెల్లెలు ఫాతిమా ఫోన్ ఎత్తకపోవడంతో గత నెల 30న ఉదయాన్నే ఆమె ఇంటికి వెళ్లిన అక్కతో పాటు ఇతర కుటుంబసభ్యులు లోనికి వెళ్లి చూడగా ఆమె మృతదేహం కనిపించింది. గ్యాస్ స్టవ్ నుంచి గ్యాస్ లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఆమెను ఖాద్రీ హత్య చేసి ఉంటాడని భావించి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సీసీ ఫుటేజీలను, సెల్ఫోన్ కాల్ లిస్ట్ను సేకరించారు.మరింత లోతుగా దర్యాప్తు చేయడంతో జంట హత్యల విషయం బయటకు వచ్చింది. ఈ మేరకు నిందితులు అస్ఘర్, సమీర్, సల్మాన్లను అరెస్ట్ చేసిన ఫిలింనగర్ పోలీసులు నదీమ్ కాలనీలోని చెరువు పక్కన పాతిపెట్టిన అహ్మద్ ఖాద్రీ మృతదేహాన్ని శనివారం వెలికితీసి పోస్ట్మార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. జంట హత్యల కేసును చాకచక్యంగా ఛేదించిన ఫిలింనగర్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.