ఇద్దరు పిల్లలతో సహా నిద్రమాత్రలు మింగిన భార్యాభర్తలు
అపస్మారకస్థితిలో తల్లిదండ్రులు, క్షేమంగా పిల్లలు
రూ. 2 కోట్ల బిల్లులు రావడం లేదని, అప్పులు పెరిగిపోయాయని సూసైడ్ నోట్
దవాఖానలో చికిత్స పొందుతున్న సివిల్ కాంట్రాక్టర్ దంపతులు
సిటీబ్యూరో, మే 25(నమస్తే తెలంగాణ): కన్న బిడ్డలకు నిద్రమాత్రలు వేసి, తల్లిదండ్రులు సైతం నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకున్నది. డయల్ 100 ద్వారా సమాచారం అందుకున్న సరూర్నగర్ పోలీసులు లాడ్జి వద్దకు చేరుకుని నిద్ర మాత్రలు మింగిన భార్యాభర్తలను దవాఖానకు తరలించారు. అయితే కుమారులకు వాంతులు కావడంతో క్షేమంగా బయటపడినట్లు తెలిసింది. భార్యాభర్తలు మాత్రం స్థానిక దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
సరూర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఖమ్మం జిల్లాకు చెందిన శశికుమార్ సివిల్ కాంట్రాక్టర్. ఇతడికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు. సివిల్ కాంట్రాక్టర్ అయిన శశికుమార్కు పంజాగుట్టలోని జీవీ ప్రతాప్రెడ్డి కంపెనీ నుంచి రూ.2 కోట్ల వరకు రావాల్సి ఉంది. డబ్బులు ఇవ్వాలని అడిగితే సదరు సంస్థ నిర్వాహకుడు జీవీ దినేశ్రెడ్డి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. బిల్లు ఇవ్వకుండా తప్పుడు ప్రచారం చేస్తూ, దొంగ కేసులు పెట్టించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. పనుల్లో భాగంగా అనేక మంది వద్ద అప్పులు చేసిన శశికుమార్కు ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఓ వైపు బిల్లులు రాక, మరోవైపు అప్పుల వారికి ముఖం చూపించలేక లోలోన కుమిలిపోయాడు. దీంతో శశికుమార్ తన భార్య శ్వేత, కుమారులు రఘుకుమార్, వరుణ్లతో కలిసి రెండు మూడు రోజుల కిందట దిల్సుఖ్నగర్కు వచ్చి గణేశ్ లాడ్జిలో దిగాడు. తన కుటుంబం మరణానికి జీవీ దినేశ్ రెడ్డి కారణమని, తాము చనిపోయిన తర్వాత దినేశ్ రెడ్డి దగ్గర రావాల్సిన రూ.2 కోట్ల నగదును తీసుకుని తాను ఇవ్వాల్సిన వారికి ఇచ్చేయాలని సూసైడ్ నోట్ రాశాడు. అదేవిధంగా సెల్ఫీ వీడియో తీశాడు. బుధవారం ఉదయం తన బావకు ఫోన్ చేసి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని, తనకు బతకాలని లేదని కుటుంబం మొత్తం చనిపోతున్నామని చెప్పాడు. ఈ విషయం తెలియగానే అతడి బావ పోలీసులకు, డయల్ 100కు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు గణేశ్ లాడ్జికి చేరుకున్నారు.
45 మాత్రలు వేసుకొని..
భార్యాభర్తలు 45 నిద్ర మాత్రలు వేసుకోగా, కుమారులు రఘు, వరుణ్లకు చెరో రెండు మాత్రలు వేశారు. భార్యాభర్తలు అపస్మారక స్థితికి చేరుకోగా పిల్లలకు వాంతులు కావడంతో క్షేమంగా బయటపడ్డారని పోలీసుల విచారణలో తెలిసింది. శశికుమార్, శ్వేతలను వైద్య పరీక్షల నిమిత్తం దవాఖానకు తరలించారు. శశికుమార్ ఫోన్, అతను రాసిన సూసైడ్నోట్ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యా యత్నానికి పాల్పడే ముందు పంజాగుట్టలోని డీవీ ప్రతాప్ రెడ్డి కార్యాలయానికి వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. దీంతో సరూర్నగర్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు.