పల్లెటూరి అందాలు.. ముసలితాతల నవ్వులు.. చిన్ననాటి దోస్తుల అల్లర్లు.. చెరువులు.. కుంటలు ఇలా ఎన్నో ప్రదేశాలతో ముడివేసుకున్న పల్లెటూరి జ్ఞాపకాలు ప్రతిఒక్క నగరవాసికి సుపరిచితమే. అందుకే పండుగలొచ్చినప్పుడు ఊరికి బయలుదేరి మధురమైన అనుభవాలను నెమరేసుకుంటూ ఆహ్లాదంగా గడుపుతుంటారు. ఇంకొందరూ పని ఒత్తిడిలో సొంతూర్లకు వెళ్లలేక నగరాల్లోనే పల్లె వాతావరణంతో కూడిన సెట్టింగ్స్లో గడపడానికి ఆసక్తి చూపుతుంటారు. అయితే పల్లెటూరి జ్ఞాపకాలు.. సంక్రాంతి సందడి.. బసవన్నల నాట్యం.. ముగ్గులు పరుచుకున్న వాకిళ్లు.. ఇలా సంక్రాంతి గుర్తొచ్చేలా నగరానికి చెందిన కళాకారులు తమ కుంచెలతో అద్భుతమైన పెయింటింగ్స్ సృష్టించారు. వాటిని చూస్తే సొంతూరు గుర్తొచ్చేలా చేశారు. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డీపీలుగా అమర్చుకుని నెటిజన్లు ఆర్టిస్టుల క్రియేటివిటిని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టడం విశేషం.
పల్లెటూరి కాన్సెప్ట్తో పెయింటింగ్స్..
పల్లె జ్ఞాపకాలను పదిలపర్చాలని కళాకారుడు రాము తన చిత్రాలతో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు. సిటీలో కాంక్రీట్ వాతావరణం విస్తరిస్తున్న సమయంలో తెలుగు పండుగలకు ఉన్న విశిష్టత కనుమరుగయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన అతడు పండుగల ప్రాధాన్యతను పెయింటింగ్స్లో చూపిస్తున్నారు. ఓవైపు వేగంగా అభివృద్ది చెందుతున్న నగరం.. మరోవైపు పల్లె కల్చర్ ఉట్టిపడేలా బసవన్నలు, పచ్చిక బయళ్లు.. అమాయక పల్లెజనాన్ని ఒకే ఫ్రేంలో అద్ది ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండుగ అనగానే బసవన్నల నృత్యాలు గుర్తొచ్చేలా పెయింటింగ్లో చూపించాడు. ఈ చిత్రం ఢిల్లీలో జరిగే ఎగ్జిబిషన్కు ఎంపిక కావడం విశేషం. మరో ఆర్టిస్టు సుకాంతి పల్లెటూరి మగువల అమాయకత్వంతో కూడిన అభినయాన్ని ఆవిష్కరించింది. పండుగలు ఎన్నొచ్చినా వారు ప్రతి రోజును పండుగలాగే భావిస్తుంటారని తన చిత్రాలతో సందేశాన్నిచ్చింది. మరో ఆర్టిస్టు భారతీకర్ ట్రెడిషనల్ ఆర్ట్తో పండుగ రోజు నియమ నిష్టలతో చేసే పూజలపై తన చిత్రాలతో అవగాహన కల్పిస్తున్నది. విఘ్నేశ్వరుడు పెయింటింగ్తో ప్రతి ఇంట్లో ఆదిదేవుడు గణపతియేనని చాటేలా ఆర్ట్ వేసింది. కట్టెల పొయ్యి మీద పండుగ పాయసం, పరమాన్నం వంటకాలు వండుతున్న సన్నివేశాలను చక్కగా కూర్చింది. కృష్ణుడు భూగోళాన్ని అలుముకున్న పెయింటింగ్ అందరిని ఆకట్టుకుంటుంది. మొక్కలు, పక్షులు, మహిళల అభ్యున్నతి తదితర అంశాలపై ఆమె అనేక పెయింటింగ్స్ వేశారు.
పల్లె నా కథా వస్తువు..
సంక్రాంతి పండుగ వచ్చిందంటే గ్రామాలు అందంగా ముస్తాబవుతుంటాయి. అప్పటి వరకు బోసిపోయినట్టు ఉన్న ఇండ్లు నగరాల నుంచి పిల్లల రాకతో సందడిగా మారుతుంటాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ కలుసుకుని ఆప్యాయంగా పలుకరించుకుంటారు. అయితే ఇవన్నీ ఒక పండుగ రోజునే చూస్తాం. అందుకే పండుగ ప్రాధాన్యతను వివరిస్తూ నేను పెయింటింగ్స్ వేశాను. ఏ పండుగ అయినా తొలుత దేవుడి పూజతోనే ప్రారంభమవుతుంది. అందుకే నేను ఎక్కువగా ఆలయాలు, దేవుళ్లు, పల్లె ఆస్తి తదితర వాటిని కథావస్తువుగా ఎంచుకున్నా.
-భారతీకర్, ఆర్టిస్టు
సెట్టింగ్స్ వేసి పల్లెను సృష్టించలేం..
పండుగలతో పల్లెటూళ్లు కొత్త శోభను సంతరించుకుంటాయి. నగరాలు బోసిపోతాయి. మనం ఎన్ని పల్లెటూరి సెట్టింగ్స్ వేసి పండుగ వాతావరణాన్ని సృష్టించాలనుకున్నా అది ప్లాస్టిక్ నవ్వు మాదిరిగానే నిలిచిపోతుంది. నిజమైన పల్లె వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఊరుకు వెళ్లాల్సిందే. అందుకే ఆ పల్లె జ్ఞాపకాలతో నగరాన్ని పోల్చుతూ సంక్రాంతి బసవన్నలతో చిత్రాలు గీశా. కరోనా జాగ్రత్తలతో బిక్కుబిక్కుమంటూ నగరవాసులు జరుపుకుంటున్న పండుగకు… ధైర్యంగా ఏమీ కాదని స్వేచ్ఛగా జరుపుకుంటున్న పల్లె జనాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వారు సంక్రాంతిని ఆస్వాదించినట్టుగా నగరవాసులు ఆస్వాదించలేరు.
-మారేడు రాము, ఆర్టిస్టు
పండుగలకు వేదికలు పల్లెటూర్లు..
స్వచ్ఛమైన మనుషుల మధ్య పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంటుంది. పల్లెటూర్లలో సంక్రాంతి సంబురాలు ఘనంగా జరుగుతుంటాయి. అందుకే నగరవాసులు పల్లెటూర్లతో సంబంధం లేకున్నా ఏదో ఒక పల్లెటూరుకు వెళ్లి అక్కడ జరిగే సెలబ్రేషన్స్లో పాల్గొని సందడిగా గడిపి ఇంటికి వస్తుంటారు. అంతలా పల్లెటూర్లు పండుగలకు వేదికలుగా నిలుస్తాయి. అందుకే పల్లె మనుషుల అలవాట్లు, ఆచారాలపై పెయింటింగ్స్ వేశా. సంక్రాంతి సంబురాలతో గ్రామాలు ఎంత కళగా ఉంటాయో చూపించడమే నా ఉద్దేశం.