సిటీబ్యూరో, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ) : పోలింగ్ ముగిసింది.. ఇక ఓట్ల లెక్కింపు మిగిలింది. గురువారం రాత్రి పోలింగ్ కేంద్రాల నుంచి ఆయా కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలలో ఈవీఎం మెషిన్లను అధికారులు భద్రపరిచారు. ఈవీఎంలను భద్రపరిచిన గదుల వద్దకు ఎవరినీ అనుమతించడంలేదు. మూడు షిప్టుల్లో సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం ఓట్ల లెక్కింపు ప్రారంభమయ్యే వరకు ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఐదు నియోజకవర్గాలకు ఒకేచోట లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా, కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కేంద్రాల వద్ద ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ సందీప్ శాండీల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు 3న ఉదయం 6 నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాలను మూసివేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.