సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : శాసనసభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎన్నికల నిర్వహణతో పాటు డిసెంబర్ 3న జరిగే కౌంటింగ్కు సంబంధించి పక్కా చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు గ్రేటర్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేశారు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు వేర్వేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు ఒకే చోట లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా, కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
నియోజకవర్గ వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో ఓట్లు నమోదైన ఈవీఎంలను కట్టుదిట్టమైన భద్రత మధ్య లెక్కింపు కేంద్రాలకు తరలించేలా ఇప్పటికే రూట్మ్యాప్ను సిద్ధం చేశారు. తరలించిన ఆనంతరం నిరంతరం సీసీ కెమెరాల నిఘా నడుమ.. భద్రత సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందించారు. డిసెంబర్ 3న లెక్కింపు చేపట్టనున్నారు. ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రాల్లో బారీకేడ్లు అమర్చుతున్నారు. నియోజకవర్గాల వారీగా ఓట్లు లెక్కించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు బయట, లోపల లైవ్ కెమెరాలు బిగిస్తున్నారు. ఈ నిఘా కెమెరాల నడుమ ఓట్లు లెక్కించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా.. రాజకీయ నాయకుల సమక్షంలో లెక్కింపు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి గొడవలు, ఘర్షణలకు ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టడానికి ఎన్నికల అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు.