ఆందోళన, ఒత్తిడిని జయిస్తేనే ఆరోగ్యం
చిన్నచిన్న సమస్యలకు కుంగిపోవద్దు..
టెన్షన్ ఫ్రీకి నడక, వ్యాయామం తప్పనిసరి
కొనసాగుతున్న ‘మానసిక ఆరోగ్యంపై అవగాహన’
నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే, ఏవీ కాలేజీ సంయుక్తాధ్వర్యంలో కార్యక్రమం
భారీగా తరలివస్తున్న యువత, తల్లిదండ్రులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని, మానసిక ఆరోగ్యమే..మహాభాగ్యమన్నారు దోమలగూడ ఏవీ కళాశాల మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే, ఏవీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం ‘యూఅండ్ మీ’ సహకారంతో రెండోరోజు గురువారం జరిగింది. ఏవీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజలింగం, మనోవిజ్ఞానశాస్త్ర విభాగాధిపతి ప్రియాంక థామస్ ఆధ్వర్యంలో సందర్శకులకు వివరించారు. మానసిక సమస్య లను ఎలా అధిగమించాలో పలు సూచనలు చేశారు.
కొవిడ్ తర్వాత పెరిగిన మానసిక సమస్యలు
కరోనా విపత్కర పరిస్థితుల తర్వాత చాలామందిలో మానసిక సమస్యలు పెరిగాయని, ప్రధానంగా యువత తీవ్ర ఆందోళనతో మానసికంగా కుంగిపోవడం, తప్పుదారులు పట్టడం వంటి సమస్యలతో బాధపడుతున్నారని వివరించారు. వీటిని అధిగమించేందుకు మత్తుపదార్థాలు, ఆల్కహాల్ తీసుకుంటున్నారని, ఇదే అలవాటుగా మారుతుందని సైకాలజీ విద్యార్థులు తెలిపారు. వాటిని దరిచేరనివ్వకుండా ఏంచేయాలో అంశాల వారీగా సూచించారు.
అతుక్కుపోకుండా..
మానసికంగా కుంగినప్పుడే వ్యసనం వైపు మళ్లుతారు. డ్రగ్స్, ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ, షాపింగ్, ఆల్కహాల్, సోషల్ మీడియా, చిన్నపిల్లలైతే టీవీలు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోవడం చేస్తారు. ఫలితంగా కండ్లల్లోంచి నీళ్లు కారడం, మారం చేయడం లాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అప్పుడు తప్పక సైకాలజిస్టులను కలిసి తగిన సలహాలు తీసుకోవడం ఉత్తమం.
రుగ్మతలను జయించాలి
మనిషి శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల కూడా మానసిక రుగ్మతలు ఏర్పడుతాయి. హార్మోన్లు నియంత్రణలో ఉంటే జీవనం సుఖవంతంగా ఉంటుంది. నిత్యం మెదడు ఒత్తిడిని జయించే ఎక్సర్సైజ్లు చేయాలి. యోగాసనాలు ఎంతో ఉపకరిస్తాయి. ‘హ్యాపీ బ్రెయిన్..హ్యాపీ లైఫ్’ అనే సూత్రాన్ని ప్రతివ్యక్తి అనుసరించాలి.
ఆలోచనలు బాగుండాలి
ఏదో ఒక సందర్భంలో ప్రతిఒక్కరికి ఆత్మన్యూనతాభావం ఎదురవుతూ ఉంటుంది.ఒంటరితనం దరిచేరనివ్వొద్దంటే..మన మూర్తిమత్వాన్ని మనమే నిత్యం పెంపొందించుకోవాలి. మన ఆలోచన వైఖరి సక్రమంగా ఉంటేనే సమాజంలో గుర్తిస్తారనే విషయం మర్చిపోకూడదు. అందుకు కావాల్సిన అంశాలను తమకు తాము లేదా మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ద్వారా తెలుకుంటే జీవితంలో రాణించడమే కాదు, ఆత్మన్యూనతా భావాన్ని దరిచేరనివ్వకుండా ఉండొచ్చు.
మంచినిద్ర.. వ్యాయామం
ప్రతిఒక్కరికి ఏదోఒక రూపంలో ఒత్తిడి ఉంటుంది. దీన్ని జయిస్తేనే మానసిక ఆరోగ్యం చేకూరుతుంది. నెగెటివ్ ఆలోచనలు, నిద్రలేమి, సామాజిక ఆలోచనలు, భావోద్వేగం, ప్రవర్తన లాంటి అంశాలు కారణమవుతాయి. ఒత్తిడిని అధిగమించాలంటే వాకింగ్, ఒంటరిగా కాకుండా ఇతరులతో అభిప్రాయాలు పంచుకోవాలి. యోగా, సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. రోజుకు 8 గంటలు నిద్ర పోవాలి.
నిరాశను అధిగమించొచ్చు
మనోవిజ్ఞానంతో నిరాశను అధిగమించొచ్చు. ప్రస్తుత రోజుల్లో మనస్తత్వవేత్తలు, కౌన్సెలర్లు సమాజానికి ఎంతో అవసరం. మానసిక సమస్యలపై ప్రజలందరికీ ఉచితంగా సేవలు అందిస్తుండడం అభినందనీయం. ఏవీ కళాశాల మనోవిజ్ఞానశాస్త్ర విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు.
– ప్రొ.వెంకటరమణ, ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్
టీనేజీ సమస్యలపై అవగాహన
10 నుంచి 19 ఏండ్ల వరకు టీనేజీ సమస్యలు వెంటాడుతుంటాయి. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలతో స్నేహపూర్వకంగా మెదులుతూ వారికి అన్ని విషయాల పట్ల తెలియజెప్పాలి. లేదంటే ఒత్తిడి, ఆందోళన, అసాంఘిక కార్యకలాపాలు, వివాదాస్పద బంధాలతో సంఘర్షణలు చెలరేగి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది.
–భవ్య, మనోవిజ్ఞానశాస్త్ర విద్యార్థి
ప్రవర్తనలో మార్పులు రావాలి
చిన్నచిన్న సమస్యలను ప్రవర్తన ద్వారా అధిగమించగలం. కానీ మానసికంగా బాగా కుంగిపోయిన సందర్భంలో బోధనలు, ఆచరణ, అవగాహన అంశాలను పాటిస్తే మానసిక రుగ్మతలకు చెక్పెట్టవచ్చు.
–నాగలక్ష్మి, మనోవిజ్ఞానశాస్త్ర విద్యార్థి
పిల్లలతో ప్రేమగా ఉండాలి
పరిసరాలు మనిషి మూర్తితత్వంపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా చిన్నారులు చిన్నచిన్న విషయాలకే అలగడం, మారాం చేస్తుంటారు. తల్లిదండ్రులు పిల్లలతో ప్రేమగా ఉండాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. కఠినంగా ఉండకుండా, ప్రేమతో పనులు చేయించాలి.
–మానస, మనోవిజ్ఞానశాస్త్ర విద్యార్థి
ఉచిత కౌన్సెలింగ్
మానసిక సమస్యలపై ఇప్పటివరకు నగరంలో ఇంతపెద్ద అవగాహన, శిక్షణ కార్యక్రమాలు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. ఎగ్జిబిషన్ను నగరంలోని పలు కళాశాలల విద్యార్థులు సందర్శించి నిపుణులతో ఉచితంగా కౌన్సెలింగ్ తీసుకున్నారు. మానసిక సమస్యలు ఎలా అధిగమించాలో అవగాహన చేసుకున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఆత్మన్యూనత, అడిక్షన్పై అవగాహన కల్పించారు.
–ప్రియాంక, మనోవిజ్ఞానశాస్త్ర విభాగాధిపతి