సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నేపథ్యంలో నగర పోలీసులు రౌడీషీటర్లపై పటిష్ట నిఘాను పెంచారు. సెంటిమెంట్తో వారిని ఇంటిలోనే ఉండేలా కట్టడి చేస్తున్నారు. రౌడీషీటర్లలో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య ‘హార్ట్ టూ హార్ట్ టాక్’ పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో భాగంగా రౌడీషీటర్లు దారి తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒక్కో జోన్ను ఒక మహిళా ఐపీఎస్ అధికారికి బాధ్యతలు అప్పగించారు. దీంతో జోన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల ఇంటికి నేరుగా మహిళా ఐపీఎస్ అధికారులు వెళ్లి మాట్లాడుతున్నారు. ఆ ఇంట్లో ఉండే రౌడీషీటర్తో పాటు అతడి భార్యా పిల్లలు, తల్లిదండ్రులతో కూడా మాట్లాడి, కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
రౌడీషీట్ నమోదు కావడంతో వచ్చే సమస్యలను వివరిస్తున్నారు. ఎన్నికల సమయంలో వారిని కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకోవాలని, అనవసరంగా బయటకు వెళ్లనీయవద్దని సూచించారు. పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారు.. తమ పనులు ముగించుకొని నేరుగా ఇంటికి చేరుకునే విధంగా వారికి రోజు కౌన్సెలింగ్ ఇవ్వాలని కుటుంబ సభ్యులతో పోలీసు అధికారులు చెబుతున్నారు. రౌడీషీటర్ల ఇంటికి మహిళా ఐపీఎస్ అధికారులు వెళ్లి.. సూచిస్తున్న సూచనలు కుటుంబ సభ్యులు శ్రద్ధగా వింటున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న కౌన్సెలింగ్తో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక నుంచి ఇంటి నుంచి బయటకు పంపియ్యమంటూ హామీ ఇస్తున్నారు.
జోన్ల వారీగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా అధికారులు.. సెంట్రల్ జోన్ డీసీపీ, ఐసీసీసీ పుష్ప, మహిళా భద్రత ఏసీపీ ప్రసన్న లక్ష్మి, నార్త్జోన్ డీసీపీ చందనా దీప్తి, సౌత్ జోన్ డీసీపీ సీసీఎస్ శిల్పవల్లి, సౌత్/వెస్ట్ డీసీపీ, టాస్క్ఫోర్స్ నిఖిత పంథ్, సౌత్ ఈస్ట్ డీసీపీ, ఉమెన్ సేఫ్టీ కవిత, వెస్ట్జోన్ డీసీపీ, టీఎస్నాబ్ సునీతారెడ్డి ఉన్నారు.