సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అంటే ట్రాఫిక్ పద్మవ్యూహం.ఇది ఒకప్పటి మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్డీపీ పథకంతో ఈ ట్రాఫిక్ సుడిగుండాలను ఒక్కొక్కటిగా ఫ్లై ఓవర్ల రూపంలో ఛేదిస్తున్నది. ఇప్పటికే నగర వ్యాప్తంగా 35 ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా 36 ప్రాజెక్టుగా ఇందిరాపార్కు స్టీల్ బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చింది. రూ.450 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు 2.25 కిలోమీటర్ల మేర నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని శనివారం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ వంతెనకు మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఉక్కు వంతెనగా నామకరణం చేశారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్రోడ్స్, ఇందిరాపార్కు క్రాస్రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు శాశ్వతంగా తొలగిపోనున్నాయి. స్టీల్ బ్రిడ్జి నిర్మించిన మార్గంలో రోజూ సుమారు లక్ష వాహనాలు నడుస్తూ ఉంటాయి. సాధారణంగా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. అధిక వాహన సాంద్రతతో పాటు ఎక్కువ జంక్షన్లు ఉండడంతో ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఓ సమస్యగా మారింది. అయితే స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లే సౌకర్యం కలిగింది. సికింద్రాబాద్, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్పేట, రామంతాపూర్, ఉప్పల్ వైపు వెళ్లే వాహనదారులు సాఫీగా సాగిపోవచ్చు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. సమైక్య పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన సెంట్రల్ హైదరాబాద్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదని తెలిపారు. గత ప్రభుత్వాలు ఈ ప్రాంతంలో ఫ్లై ఓవర్ కోసం కేవలం శంకుస్థాపనలు చేసి వదిలేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్టీల్ బ్రిడ్జిని నిర్మించి స్థానికుల సమస్యకు పరిష్కారం చూపిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ఈ సందర్భంగా ప్రశంసించారు. కాగా, స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, ఎంపీ కే. కేశవరావు, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, భేగ్, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, భేతి సుభాష్రెడ్డి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్ రెడ్డి, హైదరాబాద్ పార్టీ ఇన్చార్జి దాసోజు శ్రవణ్, కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్త, సీనియర్ నాయకులు తలసాని సాయి కిరణ్ యాదవ్, ముఠా జయసింహ తదితరులు పాల్గొన్నారు.
నగరంలోనే తొలిసారిగా ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీలు వంతెన ప్రారంభోత్సవం శనివారం అట్టహాసంగా జరిగింది. తెలంగాణ కళా ప్రదర్శనలు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల జై తెలంగాణ నినాదాల నడుమ పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు స్టీలు వంతెనను ప్రారంభించారు. మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇందిరా పార్కు వద్ద ఘన స్వాగతం ఫలికాయి. మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరుతో ప్రారంభించిన స్టీలు వంతెనపై మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ కే కేశవరావు, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ విజయలక్ష్మి ఇతర ప్రజాప్రతినిధులు తొలిసారి ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, బేతి సుభాష్రెడ్డి, ఎమ్మెల్సీలు వాణీదేవి, సలీం, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, అడిక్మెట్ కార్పొరేటర్ సునీతాగౌడ్, బీఆర్ఎస్ నేతలు దాసోజు శ్రవణ్కుమార్, ముఠా జయసింహ, ఎంఎన్ శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ వి.శ్రీనివాస్రెడ్డి, నాయిని దేవేందర్రెడ్డి, వి.సమతారెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రోస్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ముషీరాబాద్కే తలమానికం
స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ముషీరాబాద్కే తలమానికం. ముషీరాబాద్ ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. స్టీల్ బ్రిడ్జికి నాయిని పేరు పెట్టడంతో ముషీరాబాద్కు ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు ముషీరాబాద్ ప్రజలు రుణపడి ఉంటారు.
– కేఎం సాయి కుమార్, భోలక్పూర్
ట్రాఫిక్ కష్టాలు తప్పాయి
ఇందిరాపార్కు నుంచి వీఎస్టీకి వెళ్లాలంటే ట్రాఫిక్తో నానా ఇబ్బందులు పడ్డాం. ఎమ్మెల్యే ముఠా గోపాల్ పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకెళ్లడంతో నేడు స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించుకున్నాం. నేటి నుంచి ముషీరాబాద్కు ట్రాఫిక్ కష్టాలు తప్పాయి. ఇది ముషీరాబాద్ ప్రజలకు వరం.
– వై. హర్షవర్ధన్ రావు, భోలక్పూర్
దక్షిణ భారతంలోనే అతిపెద్ద స్టీలు వంతెన
ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను పలుమార్లు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల దృష్టికి తీసుకువెళ్లగా వారు స్పందించి స్టీలు వంతెన నిర్మాణానికి నిధులు కేటాయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని స్టీలు వంతెనను నిర్మించింది. స్టీలు వంతెన అందుబాటులోకి రావడంతో తార్నాక, నాచారం, అంబర్పేట్, సచివాలయం మార్గాలలో వాహనాల రాకపోకలు సాఫీగా సాగే అవకాశం ఉంది. దక్షిణ భారత దేశంలో అతిపెద్ద స్టీలు వంతెన ఏర్పాటు చేసి నాయిని నరసింహారెడ్డి పేరుతో స్టీలు వంతెన ప్రారంభించుకోవడం గర్వంగా ఉంది.
– ఎమ్మెల్యే ముఠా గోపాల్, ముషీరాబాద్
నాయిని పెట్టడం హర్షనీయం
ముషీరాబాద్ ప్రజలతో నాయినిది విడదీయరాని అనుబంధం. వీఎస్టీ – ఇందిరాపార్కు మార్గంలో నిర్మించిన స్టీలు వంతెనకు నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టడం హర్షనీయం. మా తండ్రి పేరు చిరస్థాయిగా ఉండేలా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన స్టీలు వంతెనకు పెట్టినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లకు కృతజ్ఞతలు.
– వి.సమతారెడ్డి, నాయిని కుమార్తె