బడంగ్పేట, డిసెంబర్ 16 : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్, డిప్యూటీ మేయర్ పదవులపై అవిశ్వాసం పెట్టేందుకు కార్పొరేటర్లు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. దీంతో మేయర్ చిగిరింత పారిజాత నర్సింహరెడ్డికి పదవి గండం ముంచుకొస్తున్నట్లు తెలుస్తున్నది. దీంతో బీజేపీ కార్పొరేటర్లను బుజ్జగించే పనిలో నిమగ్నమైన్నట్లు సమాచారం. డిప్యూటీ మేయర్ ఇబ్రాం శేఖర్ సైతం పదవి పోకుండా ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
అయితే కాంగ్రెస్ మేయర్కు బీజేపీ చెయ్యి ఇస్తే మాత్రం అంతే సంగతులు. ఇదిలా ఉంటే బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో 32 డివిజన్లు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి 14 మంది కార్పొరేటర్లు ఉండగా, కాంగ్రెస్కు ఏడుగురు కార్పొరేటర్లు మాత్రమే ఉన్నారు. బీజేపీకి పది మంది కార్పొరేటర్లు ఉండగా, ఒకరు మాత్రమే స్వతంత్ర అభ్యర్థి. బీఆర్ఎస్కు 14 మంది కార్పొరేటర్లు ఉండగా, స్వతంత్ర అభ్యర్థి బీఆర్ఎస్కు మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నది.
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ జత కట్టే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి దక్కించుకొని బీజేపీ కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ కట్టబెట్టాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. అయితే మేయర్ పదవిపై అవిశ్వాసం పెడితే బీఆర్ఎస్ పార్టీయే ఆ పదవి దక్కించుకునే అవకాశం ఉంది. అవిశ్వాసం నెగ్గించుకోవడానికి ప్రస్తుత మేయర్కు సొంత బలం లేదు. బీఆర్ఎస్ కు మాత్రం ఇద్దరు కార్పొరేటర్ల మద్దతు చాలు. అవసరం అయితే ఎమ్మెల్యేతో పాటు ఎక్స్అఫీషియో సభ్యుల మద్దతు తీసుకునే అవకాశం ఉంది. ఎక్స్అఫీషియో మద్దతుతో బీఆర్ఎస్ మేయర్ పీటం దక్కించుకునే అవకాశమున్నది.