అధికార కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో కాంగ్రెస్లో చేరిన మేయర్లు, చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు తిరగబడుతున్నారు. వారి ఏకపక్ష దోరణి, పార్టీ పిరాయింపును సహించడం లేదు. నిబంధనల ప్రకారం వారిపై అవిశ్వాసానికి ఇన్నాళ్లూ అవకాశం లేకపోవడంతో వారికి చేతులు కట్టేసినట్లుగా మారాయి. దీంతో లోలోనే రగిలిపోయారు. కానీ ఈ నెల చివరికి నాలుగేళ్లు పూర్తికావడంతో తిరుగుబావుటాకు సిద్ధమవుతున్నారు. సొంతపార్టీ మేయర్, చైర్మన్లపై కాంగ్రెస్కు చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లతో చేతులు కలిపి ఎలాగైనా గద్దె దింపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 5 (నమస్తే తెలంగాణ)/ఆదిబట్ల
నగర శివారుల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అవిశ్వాసాల సీజన్ వచ్చింది. వాస్తవానికి చాలాచోట్ల ఏడాది, రెండేండ్లుగా మేయర్లు, చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్లు గుర్రుగా ఉన్నారు. కానీ నిబంధనల ప్రకారం వారిపై అవిశ్వాసానికి అవకాశం లేకపోవడంతో ఇన్నాళ్లూ వారికి చేతులు కట్టేసినట్లుగా ఉంది. కానీ ఈ నెలాఖరుతో దాదాపు అన్ని స్థానిక సంస్థల కాలం నాలుగు సంవత్సరాలు దాటనుండటంతో తిరుగుబావుటాకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్, ఇబ్రహీంపట్నం, పెద్ద అంబర్పేట మున్సిపాలిటీల్లో అవిశ్వాసానికి ఇప్పటికే రంగం సిద్ధమైంది. తాజాగా ఆదిబట్ల మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం శుక్రవారం స్థానిక సంస్థల సూపరింటెండెంట్ వద్దకు చేరింది. మిగిలిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే ఈ మేరకు తీర్మానాలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ముఖ్యంగా వీటిలో రాజకీయ పరిణామాలు, పంతాలు ఒకవంతైతే.. వివిధ పార్టీల్లోని కార్పొరేటర్లు, కౌన్సిలర్లకు అవిశ్వాసం అనేది కామధేనువుగా మారింది. చాలాకాలంగా మేయర్, చైర్మన్లు తోటి సభ్యులను పట్టించుకోవడం లేదు. పనుల విషయంలోనూ వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఇదే అవకాశంగా భావించి.. అవిశ్వాసానికి గళం కలుపుతున్నారు. ఎలాగూ అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఖజానా పరిస్థితి అంతంత మాత్రంగానే తయారైంది. కేసీఆర్ ప్రభుత్వంలో సీఎం స్పెషల్ ఫండ్, ఇతరత్రా మార్గాల నుంచి నిధులు రావడం వల్ల తమ పరిధుల్లో అభివృద్ధి పనులైనా జరుగుతాయనే ఆశాభావం వారిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త సర్కారు చివరి ఏడాదిలో ఆర్థికంగా పెద్దగా ఆదుకునే పరిస్థితి ఉండదని, దీనికి తోడు రాజకీయాల కారణంగా పనులేవీ ముందుకుపడవని కార్పొరేటర్ ఒకరు అన్నారు. అందుకే అవిశ్వాసం సందర్భంగానైనా తమకు ఆర్థికంగా కొంత ఊరట కలుగుతుందని మనసులోని మాట వెల్లడించారు. తానే కాదు.. చాలామంది ప్రజాప్రతినిధులు ఇదేరీతిన ఆలోచిస్తున్నారని, ఉన్న ఒక్క ఏడాదిలో కొంత ఆర్థికంగా రావాలంటే అవిశ్వాసం తప్ప వేరే మార్గమేమీ కనిపించడంలేదన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో అధికార పార్టీలోనే ముసలం మొదలైంది. ఇక్కడ 15 వార్డులు ఉండగా.. బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరో ఏడు స్థానాల్లో గెలువగా, బీజేపీ ఒక స్థానాన్ని గెలుచుకుంది. కాంగ్రెస్కు చెందిన కొత్త ఆర్తీక అప్పట్లో బీఆర్ఎస్లోకి వచ్చి మేయర్ పీఠం ఎక్కారు. కొన్నిరోజులుకే తిరిగి కాంగ్రెస్లోకి వెళ్లారు. దీంతో అవిశ్వాసం కోసం పలువురు కౌన్సిలర్లు ప్రయత్నాలు చేసినా.. నిబంధనలు అడ్డువచ్చాయి. కాగా ప్రస్తుతం ఆ సమయం రావడంతో కౌన్సిలర్లకు అవకాశం వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆరుగురు, బీఆర్ఎస్కు చెందిన మరో ఆరుగురితో పాటు బీజేపీకి చెందిన కౌన్సిలర్ కూడా అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. దీంతో చైర్మన్, వైస్ చైర్మన్ మినహా మిగిలిన వారంతా శుక్రవారం స్థానిక సంస్థల సూపరింటెండెంట్ రమేశ్నాయక్ను కలిసి అవిశ్వాస తీర్మాన పత్రాన్ని అందించారు.
ఆదిబట్ల మున్సిపాలిటీ పాలకవర్గం ఏర్పడినప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసి గెలుపొందిన కొత్త ఆర్తీక నాటకీయ పరిణామాల మధ్య బీఆర్ఎస్ పార్టీలో చేరి చైర్మన్ అయ్యారు. చైర్మన్ ఎన్నిక సమయంలో అప్పటి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అప్పటి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ ఘర్షణ చోటుచేసుకున్నది. చైర్మన్ రేసులో ఉన్న మరో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మర్రి నిరంజన్రెడ్డి ఆ అవకాశం చేజారిన తర్వాత కాంగ్రెస్ కౌన్సిలర్లతో కలిసి నిత్యం వ్యతిరేకంగానే వ్యవహరించారు. కౌన్సిల్ సమావేశాల్లోనూ వాగ్వాదానికి దిగేవారు. కాగా ప్రస్తుతం నిబంధనల ప్రకారమే అవకాశం రావడంతో అవిశ్వాస అస్ర్తాన్ని ప్రయోగంగా ఉపయోగిస్తున్నారు.