పీర్జాదిగూడ, డిసెంబర్ 8: పీర్జాదిగూడ పెద్ద చెరువు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలని కార్పొరేషన్ మేయర్ వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం పీర్జాదిగూడ పెద్ద చెరువు అభివృద్ధిలో భాగంగా సుమారు రూ. 8 కోట్లతో చేపట్టిన సుందరీకరణ నిర్మాణ పనులను ఆయన స్థానిక కార్పొరేటర్, అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… పెద్ద చెరువు సుందరీకరణలో భాగంగా మినీ ట్యాంక్ బండ్లా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డి సహకారంతో హెచ్ఎండీఏ ద్వారా ప్రత్యేక నిధులు కేటాయించి చెరువు చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మిస్తున్నామని, పచ్చదనం చేపడుతామని తెలిపారు.
అనంతరం..కార్పొరేషన్ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022-23లో భాగంగా పరిశుభ్రమైన, సురక్షితమైన పబ్లిక్ టాయిలెట్స్, బహిరంగ ప్రదేశాలను శుభ్ర పరచడం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘టాయిలెట్స్ 2.0’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటి డివిజన్, 5వ డివిజన్లో వార్డు కార్యాలయం పరిసరాలను శుభ్రం చేసి మేయర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.