సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కమిషనరేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, కమిషనరేట్ కార్యాలయానికి వచ్చే వారు కొవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటించాలని, మాస్కు లేకుండా లోనికి రావద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. నగర కమిషనరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న మినిస్టీరియల్ స్టాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీ ఆనంద్ హాజరై ప్రసంగించారు. కమిషనర్ కార్యాలయానికి వచ్చే ప్రతి పౌరుడు సంతృప్తి చెందేవిధంగా ఉద్యోగుల పనితీరు ఉండాలని అన్నారు. అదే సమయంలో ఉద్యోగులు తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. విధుల్లో అశ్రద్ద వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ సునీతారెడ్డి, సుధారాణి, నరేందర్సింగ్, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.