హద్దుల్లేని ఆనందంతో తెల్లవార్లూ తెగ ఎంజాయ్ చేసే పబ్లు దర్జాగా కరోనా నిబంధనలను విస్మరిస్తున్నాయి. ఒకేచోట వందలాదిమంది గుమిగూడుతున్నా పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నాయి. మాస్క్లు, భౌతికదూరం ఎక్కడా కనిపించవు. వీకెండ్లతో సంబంధం లేకుండా పబ్లకు వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండగా, అదేస్థాయిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. స్వీయ నియంత్రణ మరుస్తుండడంతో గుంపులో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా మిగతావారికి వ్యాపిస్తుంది. ఇటీవల ఓ పబ్కు వెళ్లిన 10 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
“ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నలుగురం జూబ్లీహిల్స్లోని ఓ పబ్కు వెళ్లాం. చాలా ఎంజాయ్ చేశాం. కరోనా గురించి ఆలోచించలేదు. అందులో చాలా మందికి మాస్కులు లేవు. భౌతిక దూరానికి ఆస్కారమే లేదు. తెల్లవారుజాము రెండు గంటల వరకు ఎంజాయ్ చేశాం. ఆ మరుసటి రోజు కొంత అస్వస్థత అనిపించింది. రెండో రోజు దగ్గు, గొంతులో నొప్పి. అనుమానం వచ్చి కొవిడ్ పరీక్ష చేసుకున్నాక పాజిటివ్ వచ్చింది. ఒక్కసారిగా కాళ్ల కింద భూమి కంపించినట్టుగా అయింది. అనవసరంగా పబ్కు వెళ్లాననిపించింది. నాతో పాటు మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. నిజానికి పబ్కు వెళ్లే ముందరి వరకు మాకు ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేదు.” ఇది పబ్కు వెళ్లి పాజిటివ్ తెచ్చుకున్న శ్రీధర్ ఆవేదన.
నగరంలో విచ్చలవిడి ఆనందానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచే పబ్బులు ఇప్పుడు కరోనా హాట్స్పాట్లుగా అవతరిస్తున్నాయి. కొవిడ్ నిబంధనలను తుంగలో తొక్కుతూ కరో నా వైరస్ వ్యాప్తికి అవి కారణమవుతున్నాయి. ఆనందం కోసం వచ్చే వారికి అనారోగ్యాన్ని అందిస్తున్నాయి. వారాంతంతో సంబంధం లేకుండా పబ్బులకు వెళుతున్న కుర్రకారు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అదే స్థాయిలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే అంశం అందరినీ కలవరానికి గురి చేస్తోంది. అందు లో ఎంట్రీ అయ్యే వరకే కరోనా భయం.. లోపలికి వెళ్లాక మాస్క్, భౌతిక దూరానికి చోటు ఉండటం లేదు. యథేచ్ఛగా గుమిగూడటం.. ఒకరిని పట్టుకుని ఒకరు డ్యాన్స్ చేయడం.. పెద్దగా అరవడం.. తాగిన మైకంలో తదితర ఘటనలు సాధారణంగా జరుగుతాయి. ఫలితంగా కరోనాను ఆహ్వానించినట్టేననే విషయాన్ని ఆ సమయంలో వారు మరిచిపోతున్నారు.
రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్లో ఉన్న పబ్బులకు సుమారు 200ల నుంచి 300ల వరకు కస్టమర్లు వెళ్తుంటారు. సాయంత్రం నుంచి షురూ అయ్యే పబ్బుల సమయాలు తెల్లవారు జాము వరకు కొనసాగుతుంటాయి. ఇబ్బడి ముబ్బడిగా జనం పబ్బులకు వెళ్తుంటారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, పంజాగుట్ట, ఫిల్మ్నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న పబ్బులకు యమ డిమాండ్ ఉంటుంది. అయి తే, ప్రస్తుతం కొవిడ్ ప్రమాదం పొంచి ఉండటంతో నిబంధనలు అమలు చేయాల్సిన పబ్బులు వాటిని గాలికొదిలేశాయి. గంటల కొద్దీ జనం పబ్బుల్లో గుమికూడుతున్నారు. ముద్దులు, కౌగిలింతలతో కాలక్షేపం చేస్తున్నారు. స్వీయ నియంత్రణ మరుస్తున్నారు. ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. పబ్బులో ఏ ఒక్కరికి కరోనా ఉన్నా అది అందరికీ పాకుతుంది. ఇటీవల ఓ పబ్కు వెళ్లిన పది మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.
నేను అప్పుడప్పుడు స్నేహితులతో పబ్బుకు వెళ్తుంటాను. మూడ్రోజుల క్రితం పబ్కు వెళ్లాను. సాధారణంగా పబ్బు లోపల కొవిడ్ నిబంధనలు పాటించే సీరియస్నెస్ కనిపించదు. ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటారు. కేరింతలతో అరుస్తారు. ఆ సమయంలో కరోనా ఎవరికైనా ఉంటే చాలా ప్రమాదం. కొంతమంది తాగిన మైకంలో ఉంటారు. మొత్తంగా కరోనా ప్రబలడానికి పబ్బులు కారణమవుతున్నాయి. నేను మా స్నేహితులం హోం క్వారంటైన్లో ఉన్నాం. పబ్కు వెళ్లిన మాలో ఓ స్నేహితుడికి కరోనా వచ్చింది. – మధు, సాఫ్ట్వేర్ ఉద్యోగి
ఇలాంటి క్లిష్ట సమయంలో పబ్బుకు వెళ్లడం మంచిది కాదు. స్వీయ నియంత్రణ పాటించాలి. పబ్బులు, క్లబ్బులను మూసి వేస్తే బాగుంటుంది. గాలితో కరోనా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. చాలా క్లబ్బుల్లో ఎలాంటి కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవడం లేదు. లాభాపేక్ష కోసం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే అందరిని లోనికి అనుమతిస్తున్నారు. ‘నో మాస్క్.. నో ఎంట్రీ’కి మంగళం పాడారు. ఇలాంటి పరిస్థితుల్లో అవి సేఫ్ కావు. – రిత్విక