సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ) : గత కొన్ని రోజులుగా నగరంలో భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఎక్కడ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు, డీఆర్ఎఫ్ బృందాలు పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి. ఉదయం, సాయంత్రం సమయంలో కుండపోత వర్షం కురియడంతో నగర రోడ్లపై భారీ వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతున్నది. ప్రధానంగా వాటర్ లాగింగ్స్ వద్ద రద్దీ ఏర్పడి అది నగర నలమూలల ప్రభావం చూపుతున్నది. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్లలోని ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి వాటర్ లాగింగ్ పాయింట్స్పై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు వర్షపునీటిని తొలగిస్తున్నారు.
సోమవారం సాయంత్రం కార్యాలయాల నుంచి ప్రజలు ఇండ్లకు వెళ్లే సమయంలో భారీగా వర్షం కురిసింది. సాధారణంగా ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. దీనికి తోడుగా ఒక్కసారిగా 4 సెంటీమీటర్ల వర్షం పడటంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీంతో ప్రధాన రోడ్లన్ని వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్ రద్దీని పరిష్కరించేందుకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మ్యాన్హోల్స్, ఇతర మార్గాల ద్వారా బయటకు పంపించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.