బంజారాహిల్స్, సెప్టెంబర్ 11: వంటింటిలో గ్యాస్ లీకైన విషయాన్ని గమనించక.. నిద్రమత్తులో లైట్ వేయడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు వారిద్దరి పిల్లలకు కూడా గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భర్త మరణించాడు. భార్య పరిస్థితి కూడా విషమంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. ఈ ఘటన ఫిలింనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఫిలింనగర్లోని మహాత్మాగాంధీనగర్ బస్తీలో వాంబే గృహసముదాయంలో నివాసముంటున్న రమేశ్ (38), శ్రీలత దంపతులు. హర్షవర్దన్, సీత వీరి సంతానం. వంటింటిలో గ్యాస్ సిలిండర్ పైపు నుంచి గ్యాస్ లీక్ అయ్యింది. రాత్రంతా గదిలో గ్యాస్ నిండిపోయింది. పిల్లలతో పాటు గదిలో నిద్రించిన రమేశ్ దంపతులు సోమవారం ఉదయం 6 గంటలకు నిద్రలేచారు. హాల్లోకి వెళ్లిన రమేశ్ లైట్ వేసేందుకు స్విచ్ వేశాడు. అప్పటికే గదిలో గ్యాస్ వ్యాపించి ఉంది. లైట్ వేయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పేలుడు సంభవించింది.
ఈ ఘటనలో రమేశ్, శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు పిల్లలు కూడా గాయపడ్డారు. గ్యాస్ పేలుడు శబ్దంతో స్థానికులు అప్రమత్తమై వచ్చి, మంటలను అదుపుచేశారు. కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రమేశ్, శ్రీలతతో పాటు వారి పిల్లలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. సుమారు 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమేశ్ సాయంత్రం మరణించాడని, శ్రీలత పరిస్థితి కూడా విషమంగానే ఉన్నదని వైద్యులు తెలిపారు. ఫిలింనగర్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్యాస్ లీక్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.