మేడ్చల్, జూలై 2(నమస్తే తెలంగాణ): వంట గ్యాస్(సిలిండర్) బుకింగ్ కష్టాలు కొనసాగుతున్నాయి. వినియోగదారులు గ్యాస్ బుకింగ్ చేసుకున్నప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండానే ఏజెన్సీలు సంబంధిత బుకింగ్ను క్యాన్సల్ చేస్తున్నాయి. అయితే గ్యాస్బండ కోసం ఎదురు చూసిచూసి గ్యాస్ ఏజెన్సీలకు వినియోగదారులు ఫోన్ చేస్తే బుకింగ్ క్యాన్సల్ అయ్యిందని.. మరోసారి బుకింగ్ చేసుకోవాలని చెబుతున్నారు. అయితే బుకింగ్ చేసిన 10 నుంచి 12 రోజుల వరకు బుకింగ్ క్యాన్సిల్ చేసిన విషయాన్ని చెప్పకుండా.. తామంతట తామే ఫోన్ చేస్తే చెప్పడం ఏమిటని వినియోగదారులు మండిపడుతున్నారు.
తాము కేవైసీ చేయించినప్పటికీ ఎలాంటి సమాచారం లేకుండా బుకింగ్ క్యాన్సిల్ అవుతోందని వాపోతున్నారు. మేడ్చల్, మల్కాజిగిరి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఉప్పల్ నియోజకవర్గాలలో 56 గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. అయితే వంట వంట గ్యాస్కు ఎలాంటి కొరత లేదని అధికారులు చేపుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో గ్యాస్ బుకింగ్లను ఏజెన్సీలు క్యాన్సల్ చేస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర కంటే రూ.300-రూ.500 వరకు అధికంగా విక్రయిస్తున్నట్లు సమాచారం.