సికింద్రాబాద్ : గత కొన్నేండ్లుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో కంటోన్మెంట్ బోర్డు అధికారులు నూతన కాంట్రాక్ట్ విధానాన్ని తెరపైకి తీసుకురావడంతో చెత్త సేకరించే కార్మికులకు చిక్కులు వచ్చి పడ్డాయి. కాంట్రాక్ట్ విధానంతో నూతన చెత్త సేకరణ వాహనాలను సమకూర్చుకోవాల్సి రావడం, గతంలో ఉన్న త్రీ వీలర్స్ వాహనాలకు అనుమతి లేకపోవడంతో కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.
నూతన విధానంతో సుమారు 200 మంది కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలోనే నూతన కాంట్రాక్ట్ ను దక్కించుకున్న ఫుణేకు చెందిన స్వయుంబు సంస్థ తన కార్యాకలాపాలను బోయిన్పల్లి సర్కిల్ను ఫైలెట్ ప్రాజెక్ట్ గా తీసుకుని మొదటగా 15 చెత్త సేకరించే వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. నాటి నుంచి పాత కార్మికులకు, కాంట్రాక్ట్ సంస్థకు మధ్య వాగ్వాదం నడుస్తుంది.
రెండు రోజులుగా చెత్తను సేకరించకుండా కార్మికులు స్వచ్ఛ ఆటోలను అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు కార్మికులు రెండు రోజుల క్రితం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంత్రి మల్లారెడ్డి కంటోన్మెంట్ బోర్డు సీఈఓ అజిత్రెడ్డితో మాట్లాడి కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు నిర్ణయించారు.
సోమవారం బోర్డు కార్యాలయంలో అధికారులతో పాటు ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి మంత్రి మల్లారెడ్డి సమావేశమయ్యారు. తొలుత అంతర్గతంగా సమావేశమైన మంత్రి మల్లారెడ్డి అనంతరం కార్మికులతో కలిసి భేటీ అయ్యారు.
పాత వాహనాలను చెత్త సేకరణకు వినియోగించే అవకాశం లేదని, ఆదే విధంగా ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా ప్రజల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయరాదని స్పష్టం చేశారు. క్లీన్ కంటోన్మెంట్ దిశగా బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు కాంట్రాక్ట్ పద్దతిని ప్రవేశపెట్టారని, ప్రస్తుతం పని చేస్తున్న 200 మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకుని నూతన వాహనాలను సమకూర్చుకోవాలని చెప్పారు.
ప్రధానంగా ఇప్పటికే బోయిన్పల్లి సర్కిల్లో 15 కొత్త వాహనాలతో చెత్త సేకరణ జరుగుతుందని, మిగతా ఆరు వార్డుల్లో చెత్త సేకరణకు కార్మికులు నూతన వాహనాలు సమకూర్చుకోవాలని సూచించారు. బోయిన్పల్లి సర్కిల్లో ఉన్న వాహనాలను సైతం పాతవారే నడుపుకునేలా అధికారులు అనుమతి ఇవ్వడం శుభపరిణామమని మంత్రి మల్లారెడ్డి తెలిపారు.
వాహనాల కొనుగోలుకు ఇబ్బందులు ఉన్నాయని మంత్రికి కార్మికులు చెప్పడంతో సుమారు 60 వాహనాలను తాను ఇప్పిస్తానని, స్వచ్ఛతకు కంటోన్మెంట్లో పెద్దపీట వేసే విధంగా కార్మికులు కృషి చేయాలన్నారు. 15 రోజుల్లోగా నూతన వాహనాలను సమకూర్చి చెత్త సేకరణకు సిద్ధంగా ఉంచుతానని మంత్రి స్పష్టం చేశారు.
సమస్య పరిష్కారం కావడంతో కార్మికులు మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బోర్డు అధికారులు దేవేందర్, ఆఫ్జల్, మహేందర్తో పాటు వికాస్ మంచ్ సభ్యులు ఎబెల్, సంకి రవీందర్తో పాటు కార్మికులు తదితరులు పాల్గొన్నారు.