సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): చికిత్స, సేవల పేరుతో రోగి నుంచి భారీగా వసూలు చేసిన దవాఖానకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 భారీ జరిమానా విధించింది. అధిక చార్జీలపై మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానకు మొట్టికాయలు వేసింది. ఈ కేసును హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ విచారించింది. దూద్బౌలీకి చెందిన అబిద్ హుస్సేన్ దగ్గు, జ్వరం, రక్తంలో చకెర స్థాయిలు నియంత్రణలో లేక తీవ్రమైన అనారోగ్యంతో 2020, జూలై 16న మలక్పేటలోని మెట్రోక్యూర్ దవాఖానలో చేరారు. పరీక్షల తర్వాత అతడికి కరోనా వైరస్ సోకినట్లు తేలింది.
చికిత్స అందించిన తర్వాత ఫిర్యాదుదారుడిని జూలై 25న డిశ్చార్జి చేశారు. అన్ని పరీక్షలతోపాటు చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం రూ. 5,54,018లు రిసిప్ట్ అమౌంట్గా పేర్కొన్నారు. బిల్లు పూర్తిగా చెల్లించారు. అయితే, వినియోగదారుల చట్టంలోని నిబంధనలకు విద్ధంగా, కొవిడ్ మహమ్మారి సమయంలో చార్జీలపై పరిమితిని నిర్ణయించే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి.. అధిక చార్జీలు వసూలు చేసిన దవాఖానపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని బాధితుడు వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. విపరీతమైన వైద్య ఖర్చుల కారణంగా ఆర్థిక భారంతో పాటు కుటుంబ సభ్యులమంతా ఇబ్బందులు ఎదుర్కొని, మానసిక వేదనకు గురయ్యామంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతోపాటు చెల్లింపు రసీదులు, తుది బిల్లు, ఫార్మసీ వివరాలు అన్ని కలిపి నివేదిక రూపంలో సమర్పించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన చార్జీల కంటే బాధితుడి నుంచి అధికంగా వసూలు చేసిన దవాఖాన నష్టపరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్-1 బెంచ్ ఆదేశించింది. బాధితుడికి రూ.2 లక్షల నష్టపరిహారంతో పాటు కోర్టు ఖర్చుల కింద రూ.10వేలు అందజేయాలని సూచించింది. కోర్టు ఆదేశాలను 45 రోజుల్లోగా పాటించాలని సూచించింది.