సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదానికి గురైన గూడ్స్ వాహనం (ట్రక్) మరమ్మతులో నిర్లక్ష్యం వహించిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. మేడ్చల్ పట్టణం ఎల్లమ్మతోటకు చెందిన పరిక్షిత్మిశ్రా వ్యాపారి. 2017లో వస్తు రవాణా కోసం నేషనల్ పర్మిట్తో ట్రక్కును కొనుగోలు చేశాడు. 2018లో నల్గొండ జిల్లాలోని ఓ గ్రామం వద్ద ఎన్హెచ్-7 పై ప్రమాదం జరిగింది. వాహన ఇన్సూరెన్స్ కోసం అన్ని పత్రాలను జతపరిచినా.. బీమాను క్లెయిమ్ చేయడంలో న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ నిర్లక్ష్యం వహించింది. బాధితుడు లీగల్ నోటీసు జారీ చేసినా సంబంధిత కంపెనీ స్పందించలేదు.
కేసు పూర్తి వివరాలను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంటక సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్నలతో కూడిన బెంచ్ పరిశీలించింది. మరమ్మతుల కోసం బీమా క్లెయిమ్ చేయడంలో కంపెనీ నిర్లక్ష్యం వహించినట్లు రుజువైంది. వాహన మరమ్మతుల కోసం రూ.2,65,434లకు 12 శాతం వడ్డీతో పాటు నష్టపరిహారంగా రూ.2 లక్షలు, రూ.10వేలు కేసు ఖర్చుల కింద ట్రక్కు యజమానికి చెల్లించాలని ‘న్యూ ఇండియా అస్యూరెన్స్’ను ఆదేశించింది.