సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కూతురు పెండ్లిని అంగరంగ వైభవంగా చేసేందుకు ఫంక్షన్ కోసం రూ.20వేలు చెల్లించి ఫంక్షన్ హాల్ బుక్చేశారు. కరోనా పేరుతో ఫంక్షన్ హాల్ యజమాని తిరస్కరించడంతో ఇంటివద్దే బిడ్డ లగ్గం పూర్తిచేశారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగివ్వాలని కోరగా.. యజమాని ఇబ్బందులు పెట్టడంతో పెండ్లి కుమార్తె తండ్రి వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. రూ.20 వేలు తిరిగి చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మీప్రసన్న, ఎస్.మాధవిలతో కూడిన బెంచ్ గ్రాండ్ ఇంపీరియల్ ఫంక్షన్ ప్యాలెస్ మేనేజర్ను ఆదేశించింది. ఓల్డ్ మలక్పేట్కు చెందిన సయ్యద్ అబ్రార్ హమ్జా నదీమ్ తన కూతురు పెండ్లి కోసం 2021 మే 27న గ్రాండ్ ఇంపీరియల్ ఫంక్షన్ ప్యాలెస్ను రూ.20వేలు చెల్లించి బుక్ చేశాడు.
పెండ్లి జరిపించేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా.. ప్యాలెస్ యాజమాన్యం కొవిడ్ పేరుతో నిరాకరించింది. దీంతో ఫిర్యాదుదారుడు తన కూతురు వివాహాన్ని ఇంటివద్దే జరిపించాడు. తాను చెల్లించిన రూ.20వేలు తిరిగివ్వాలని కోరగా.. దాటవేత ధోరణితో వ్యవహరిస్తూ ఫంక్షన్ హాల్ నిర్వాహకులు మానసిక వేదనకు గురిచేశారు. దీంతో బాధితుడు న్యాయం కోసం వినియోగదారుల కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను అధ్యక్షురాలు, సభ్యులతో కూడిన బెంచ్ పరిశీలించింది. రూ.20వేలతో పాటు రూ.10 వేలు నష్టపరిహారంగా చెల్లించాలని గ్రాండ్ ఇంపీరియల్ ఫంక్షన్ ప్యాలెస్ మేనేజర్ను ఆదేశించింది. ఈ ఆదేశాలు అందుకున్న 30 రోజుల్లో పాటించాలని, లేనిపక్షంలో 8 శాతం అదనపు వడ్డీ చెల్లించే వరకు వర్తిస్తుందని వెల్లడించింది.