రంగారెడ్డి జిల్లా కోర్టులు, జనవరి30 (నమస్తే తెలంగాణ) : నాసిరకం లిఫ్టు ఏర్పాటు చేసిన ఎస్వీ ఎలివేటర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమాని నవీన్కు జరిమాన విధిస్తూ రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి,సభ్యులు వి.జనార్దన్రెడ్డి తీర్పునిచ్చారు. ఫిర్యాదుదారు ఆవుల హేమలత కథనం ప్రకారం.. కొత్తపేటకు చెందిన ఆవుల హేమలత తన ఇంటికి లిఫ్టు కోసం చిక్కడపల్లికి చెందిన సదరు సంస్థ యజమాని గోమతి నవీన్ను సంప్రదించి రూ. 6లక్షలకు 2020 మార్చి11న ఒప్పందం చేసుకున్నది.
డబ్బు మొత్తం చెల్లించినప్పటికీ ఒప్పందానికి విరుద్ధంగా నవీన్ నాణ్యతలేని పరికరాలతో లిఫ్ట్ ఏర్పాటు చేశాడు. దీంతో హేమలత లీగల్ నోటీస్ పంపించినా స్పందించకపోవడంతో రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించింది. కేసు పూర్వాపరాలను విచారించిన వినియోగదారుల ఫోరం అధ్యక్షులు చిట్నేని లతాకుమారి ఫిర్యాదుదారు దగ్గర తీసుకున్న రూ. 6 లక్షలను 9శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని, నష్టపరిహారంగా 30వేలు ఖర్చుల కింద 5వేలు 45రోజుల్లో చెల్లించాలని సంస్థ యజమాని నవీన్ ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.