Hyderabad Collectorate | సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : పాటిగడ్డలో హైదరాబాద్ జిల్లా నూతన కలెక్టరేట్ భవవాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. రాష్ట్ర సచివాలయంలోని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తన చాంబర్లో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరయ్యారు. పాటిగడ్డలో కలెక్టరేట్ భవన నిర్మాణానికి ప్రతిపాదించిన కలెక్టర్.. దాదాపు పదమూడు ఎకరాల స్థలం అవసరమని చెప్పారు.
ప్రస్తుతం కలెక్టరేట్లో 39 డిపార్ట్మెంట్లు పని చేస్తున్నాయి. వాటిలో కేవలం ఏడు మాత్రమే కలెక్టరేట్లో కొనసాగుతున్నాయి. మిగితా 32 శాఖలన్నీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయని కలెక్టర్ మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందించిన మంత్రి.. జిల్లా కలెక్టరేట్ నూతన భవన నిర్మాణం అంశాన్ని సీఎం రేవంత్రెడ్డితో చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.