ప్రధాన రోడ్లలో వందల కోట్ల నిధులతో ఫ్లై ఓవర్ల నిర్మాణాలు
తీరనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
చార్మినార్, జనవరి 7 : ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ కొత్త మార్గాలను అభివృద్ధి చేస్తూ పాతనగరాన్ని సైతం అభివృద్ధి చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు రూపురేఖలను పూర్తిస్థాయిలో మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఇటీవలే అందుబాటులోకి వచ్చిన అబ్దుల్ కలాం ఫ్లై ఓవర్తోపాటు మరో మూడు ఫ్లై ఓవర్లు చార్మినార్ జీహెచ్ఎంసీ జోన్ పరిధిలో శరవేగంగా పనులను పూర్తిచేసుకోవడానికి సిద్ధమవుతున్నాయి.
నిర్మాణ దశలో ఫ్లై ఓవర్లు..
ట్రాఫిక్ ఇబ్బందులకు వీడ్కోలు చెబుతూ, వేగవంతమైన కనెక్టివిటీ, సులువుగా గమ్యస్థానాలను చేరుకోవడానికి అనువైన కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే బహదూర్పురా, తాడ్బన్- ఆరాంఘర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ పొడగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. బహదూర్పురా ఫ్లై ఓవర్ పనులు రెండు వైపులా నిర్మాణ పనులు పూర్తికావచ్చినా ప్రధానమైన మధ్య భాగంలో గిడ్డర్ల అమరిక పనులు కొనసాగుతున్నాయి. తాడ్బన్- ఆరాంఘర్ ఫ్లై ఓవర్ నిర్మాణంలో రోడ్డు విస్తరణ పనులు ఇప్పటికే పూర్తి చేసుకుని పిల్లర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
పూర్వవైభవం రానున్నది
పాతనగరానికి పూర్వవైభవం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుంది. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులే అందుకు తార్కాణంగా నిలుస్తున్నాయి. మజ్లిస్ పార్టీతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూనే గతంలో ఏ ప్రభుత్వం అభివృద్ధి చేయనంతగా టీఆర్ఎస్ ప్రభుత్వం పాతనగరానికి అధిక ప్రాధాన్యతను అందిస్తూ అభివృద్ధి పర్చడానికి ప్రయత్నిస్తుంది. వందల కోట్ల నిధులతో కొనసాగుతున్న ఈ అభివృద్ధి పనులతో ప్రజలకు మెరుగైన సౌకర్యాలను అందించనున్నది. – పుప్పాల రాధాకృష్ణ, టీఆర్ఎస్ నాయకుడు
ఆర్థిక సంవత్సరం లోపు పూర్తి
బహదూర్పురా వద్ద నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తికావస్తే బెంగళూరు జాతీయ రహదారితోపాటు కిషన్బాగ్, అత్తాపూర్ మార్గంలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోనున్నాయి. ఫలితంగా వాహనదారులకు మరింత సులువైన మార్గాలు అందుబాటులోకి రానున్నాయి. తాడ్బన్- ఆరాంఘర్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తికావస్తే మరింత వేగవంతంగా విమాన ప్రయాణికులు ఏయిర్పోర్ట్కు చేరుకోవడానికి వీలుకలుగనున్నది.-అశోక్ సామ్రాట్, జీహెచ్ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్