ఖైరతాబాద్, జనవరి 18 : సొంతిల్లు ప్రతిఒక్కరి కల. దీన్ని సాకారం చేసుకునేందుకు ఎన్నో కష్టాలు ఓర్చుతాం. ఎన్నో అవస్థలను అధిగమించి ముందుకు సాగుతాం. పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిస్తూ సకల సదుపాయాలు సమకూర్చుతోంది. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో లబ్ధిదారులకు సొంతింటి కల నెరవేరగా, ఖైరతాబాద్లో త్వరలోనే డబుల్ బెడ్రూం గృహాల్లో నిరుపేదలు ప్రవేశం చేయనున్నారు. పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ ఇండ్ల సముదాయాన్ని ప్రారంభించనున్నారు.
210 మందికి సొంతిళ్లు
ఇందిరానగర్కాలనీలో నిర్మితమైన డబుల్ ఇండ్లతో 210 మంది సొంతింటి కల నెరవేరనున్నది. నాలుగు బ్లాకులుగా, సిల్ట్+5గా నిర్మాణం చేపట్టారు. మొదటిబ్లాకులో 30, రెండోబ్లాకులో 80, మూడోబ్లాక్లో 40, నాల్గవ బ్లాకులో 60 గృహాలు నిర్మించారు.
అన్ని వసతులు..
ఖైరతాబాద్ ఇందిరానగర్ కాలనీలో చేపట్టిన డబుల్ ఇండ్లకు రూ.17.85 కోట్లు వెచ్చించారు. నాలుగు బ్లాకులకు కలిపి 7 లిఫ్టులను ఏర్పాటు చేశారు. నీటి సౌకర్యం కోసం అధిక సామర్థ్యం ఉన్న రెండు బోర్లు వేశారు. స్టోరేజీ కోసం 50 వేలు, 30 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న సంపులు నిర్మించారు. ప్రతి బ్లాకుకు ఓవర్హెడ్ ట్యాంకులు నిర్మించారు. జలమండలి ద్వారా ప్రభుత్వ నల్లా సౌకర్యం కూడా కల్పించారు. పచ్చదనం కోసం హార్టికల్చర్ ఆధ్వర్యంలో మొక్కలను సైతం నాటారు. డబుల్ బెడ్రూం గృహాలకు సూచికగా చక్కటి కమాన్ నిర్మించారు. నాలుగుబ్లాకుల్లో మొత్తం 12 దుకాణాలున్నాయి. వీటిద్వారా వచ్చే ఆదాయాన్ని అపార్ట్మెంట్ల నిర్వహణ కోసం వెచ్చిస్తారు.