సిటీబ్యూరో, అక్టోబర్ 16 (నమస్తే తెలంగాణ) ; గ్రేటర్ హైదరాబాద్లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టి పేదలకు ఉచితంగా అందజేస్తామని రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం పట్ల నిరుపేదల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తొలి విడతలో ఇండ్లు దక్కించుకున్న 69 వేల మంది లబ్ధిదారులంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటామని చెబుతున్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ర్రూం ఇళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అందుతాయంటూ దరఖాస్తు చేసుకున్న వారికి ధైర్యం చెబుతున్న పరిస్థితి. ఎక్కడా పైరవీ లేకుండా పైసా ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా ర్యాండమైజేషన్ సాఫ్ట్వేర్ ద్వారా ఇంటిని దక్కించుకున్నామని ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని లబ్ధిదారులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి విడతలో మరో 31 వేల ఇండ్ల పంపిణీతో పాటు అదనంగా లక్ష డబుల్ బెడ్ ర్రూం ఇండ్ల నిర్మాణంతో నిరుపేదల్లో కొత్త ఆశలు చిగురించాయి. గ్రేటర్లో నిరుపేదలు ఆత్మగౌరవంగా
నివసించేలా రెండో విడతలో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం చేపడతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే తొలి విడతలో జీహెచ్ఎంసీ అవతల, ఓఆర్ఆర్ అవతల నిర్మించగా..ఈ సారి మాత్రం రెండో విడత ఎక్కువగా నగరంలోని ప్రభుత్వ స్థలాల్లోనే నిర్మించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుందని సీఎం కేసీఆర్ తెలుపడం పట్ల పేదలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జీవితంలో మర్చిపోలేం..
నా భర్త డ్రైవర్గా పని చేస్తుండగా… నేను టైలరింగ్ చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాం. నేను రైల్నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. 2017లో డబుల్ బెడ్ రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. రెవెన్యూ అధికారులు నాకు ఫోన్ చేసి మీకు డబుల్ బెడ్ రూం ఇల్లు అలాట్మెంట్ అయింది అని చెప్పడంతో ఆ రోజు నా ఆనందం చెప్పలేనిది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత నాకు ఇంటి పట్టాను ఇచ్చారు. మా లాంటి పేద ప్రజలను గుర్తించి ఇల్లు కేటాయించడం సంతోషంగా ఉంది. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం.
– బి. సౌజన్య, రైల్నిలయం,కంటోన్మెంట్, డబుల్ బెడ్ రూం లబ్ధిదారురాలు
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం
సీఎం కేసీఆర్ సారుకు రుణపడి ఉంటా. నేను 2017లో డబుల్ బెడ్ రూం ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. రెవెన్యూ అధికారులు నాకు ఫోన్ చేసి మీకు మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలో డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించామని చెప్పడంతో సంతోషపడ్డా. కంటోన్మెంట్ నియోజకవర్గం రైల్నిలయం అంబేద్కర్నగర్ బస్తీలో కిరాయి ఇంట్లో ఉంటున్నాం. ఇండ్లలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నా. బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు డబుల్ ఇల్లు కేటాయించింది. పేదలను గుర్తించి ఇల్లు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– మరియమ్మ, రైల్నిలయం, కంటోన్మెంట్, డబుల్ బెడ్ రూం ఇంటి లబ్ధిదారురాలు
విశ్వసనీయతకు నిదర్శనం
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూం పథకంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. రహ్మత్నగర్ డివిజన్ శ్రీరాంనగర్లో గత 15 ఏండ్లుగా నివాసం ఉంటున్నాం. నగరంలో విపరీతంగా పెరుగుతున్న ఇంటి అద్దెలతో ఇబ్బందులు పడుతున్నాం. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇళ్లులేని వారి ఇబ్బందులు తీర్చేందుకు మరో లక్ష డబుల్ బెడ్రూమ్ గృహాలు నిర్మించి ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడం విశ్వసనీయతకు నిదర్శనం. ఎన్నికల తరువాత తప్పకుండా డబుల్ బెడ్రూమ్ గృహం మంజూరవుతుందన్న నమ్మకం ఉంది.
– ఆర్. సంధ్యారాణి, శ్రీరాంనగర్, జూబ్లీహిల్స్
ఇల్లు దక్కుతుందనే నమ్మకం ఉంది..
పేదలకు సొంత ఇండ్లు కట్టి ఇవ్వడమనేది సంక్షేమ పథకాల్లోనే గొప్పది. నగరంలో ఇప్పటికే లక్ష డబుల్ ఇండ్లు కట్టి కొంతమందికి ఇచ్చారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పడం సంతోషాన్నిచ్చింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో అన్నివర్గాలకు సంక్షేమంతో కొత్త పథకాలు ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మాకు సొంత ఇంటిని ఇస్తారని భావిస్తున్నాం. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి.
– వీ.స్నేహ, ఇంటి దరఖాస్తుదారు, జగద్గిరిగుట్ట
సొంతింటి కల నెరవేరింది
బీఆర్ఎస్ ప్రభుత్వంలో సొంతింటి కల నెరవేరింది. సీఎం కేసీఆర్ మాకు దేవుడు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధి శ్రీరామకాలనీలో ఉంటున్నాం. నా భర్త శేఖర్ ఆటో నడపడంతో వచ్చే ఆదాయంతో కుటుంబం మొత్తం గడవాలంటే కష్టంగా ఉండేది. రేకుల ఇంట్లో అద్దెకు ఉండేవాళ్లం. అనారోగ్యాలకు గురైనప్పుడు అప్పులు తెచ్చుకునే పరిస్థితి. కేసీఆర్ పుణ్యమా అంటూ డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. సొంతింటి కళ నెరవేరింది.
– భవాని, పహాడీషరీఫ్,డబుల్ బెడ్రూం లబ్ధిదారురాలు
ఇల్లు వస్తుందనే నమ్మకం ఉంది
డబుల్ బెడ్ రూం ఇంటి కోసం ఐదేండ్ల కిత్రం దరఖాస్తు చేసుకున్నా. తమతోపాటు చేసుకున్న అనేక మందికి ఇండ్లు వచ్చాయి. మాకు రాలేదు…బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా మరో లక్ష ఇండ్ల కట్టిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. సార్ చెబితే కచ్చితంగా ఇస్తారు. ఇందులో మాకు వస్తుందనే నమ్మకం ఉంది. కూలీ పనులు చేసుకుంటూ.. అద్దె ఇంట్లో ఉండే మాలాంటి పేదోళ్లకు ఇండ్లు కటిస్తే మేము జీవితాంతం సార్ను గుర్తించుకుంటాం. సారు గెలిచిన తరువాత మా సొంతింటి ఆశ తీరుతుందని అనుకుంటున్నా.
– బైండ్ల వెంకటమ్మ, సింగరేణికాలనీ, సైదాబాద్