కేపీహెచ్బీ కాలనీ, జనవరి 17 : కేపీహెచ్బీ కాలనీ 2వ రోడ్డులోని రేణుకా ఎల్లమ్మ దేవాలయం పక్కన రోడ్డుపై షెటర్లను ఏర్పాటు చేస్తున్నా.. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేపీహెచ్బీ కాలనీ మెట్రో స్టేషన్ పక్కన ఖాళీ స్థలంలో ఓవైపు సర్వీస్ రోడ్డులో డబ్బాలు పెట్టుకుని రోడ్డునంతా ఆక్రమించారు. మరోవైపు దేవాలయం పక్కనే కొత్తగా షెటర్లను నిర్మిస్తున్నారు. దీనిపై ప్రజా ప్రతినిధులతో పాటు జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. కానీ.. వారం రోజులు గడుస్తున్నా అక్రమంగా నిర్మిస్తున్న షెటర్లను తొలగించడంలో మాత్రం అధికారులు వెనుకంజ వేస్తున్నారు. ఈ షెటర్ల నిర్మాణంతో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయని.. మెట్రో స్టేషన్ మెట్లనుంచి.. కాలనీ 2వ రోడ్డు, సర్వీస్ రోడ్డుకు వచ్చే వారికి ఆటంకం కలుగుతున్నదని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికే 2వ రోడ్డు మొదట్లో ఇరువైపులా పూల దుకాణాలు, ఇతర తోపుడు బండ్ల కారణంగా రోడ్డుపైనే వాహనాలు నిలిపుతున్నారని.. తద్వారా ఆ రోడ్డు మార్గం మూసుకుపోతున్నదన్నారు. కొత్తగా షెటర్లను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు మరింతగా పెరుగుతాయని కాలనీవాసులంతా కలిసి మొర పెట్టుకుంటున్నారు.
త్వరలో చర్యలు తీసుకుంటాం..
ఈ విషయాన్ని మూసాపేట్ టౌన్ప్లానింగ్ సెక్షన్ ఆఫీసర్ మహేందర్ను వివరణ కోరగా రోడ్డుపై అక్రమంగా నిర్మించిన షెటర్లను తొలగించాలని ఫిర్యాదులు వచ్చిన మాట వాస్తవమేనన్నారు. పండుగ సెలవుల కారణంగా తొలగింపు ఆలస్యమైందని, రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని ఆయన తెలిపారు.