నవంబర్ 26 : పంజాగుట్ట సర్కిల్ అంటే ఓ ట్రాఫిక్ వలయంగా కనిపిస్తుంది. సికింద్రాబాద్-మెహిదీపట్నం, కూకట్పల్లి-ఖైరతాబాద్తో పాటు అనేక ప్రాంతాలకు ఇక్కడి నుంచి ప్రధానమైన రూట్లు ఉన్నాయి. జాతీయ రహదారి కూడా కావడంతో నిత్యం ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులతో పాటు లక్షలాది భారీ, మధ్యతరహ, ద్విచక్రవాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. అనేక షాపింగ్ మాల్స్, ఏసీపీ కార్యాలయం, పోలీస్ స్టేషన్, నిమ్స్ దవాఖాన, విద్యాసంస్థలు సైతం ఉండటంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్ చిక్కుముడుల నుంచి పాదచారులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పంజాగుట్ట నాగార్జున సర్కిల్లో నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి తుది దశకు చేరుకున్నది. మరో వారం పది రోజుల్లో పాదచారులకు అందుబాటులోకి రానున్నది.
రూ.3.5 కోట్లతో నిర్మాణం
గతేడాది ఫుట్ ఓవర్ బ్రిడ్జి పూర్తి కావాల్సి ఉండగా, కాంట్రాక్టర్ కొంత అలసత్వం ప్రదర్శించడంతో దాని నిర్మాణంలో ఆలస్యమైంది. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు సదరు కాంట్రాక్టర్కు లక్ష రూపాయల జరిమానా సైతం విధించడంతో ఈ ఏడాది లాక్డౌన్ తర్వాత నిర్మాణ పనుల్లో వేగం పుంజుకున్నది. .రూ.3.5 కోట్లతో నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తి కాగా, ఎక్సలేటర్లు, లిఫ్టులు అమర్చి పాదచారులకు అందుబాటులోకి తీసుకొస్తారు. ఇదిలా ఉండగా, సర్కిల్ 18 పరిధిలో జీవీకే మాల్ వద్ద మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభం కావాల్సి ఉంది.
నిర్ణీత కాలంలో అందుబాటులోకి తీసుకొస్తాం
పంజాగుట్ట ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం 95 శాతం పూర్తయ్యింది. పాదచారులకు మెట్ల దారితో పాటు వృద్ధులు, మహిళలకు సౌకర్యంగా ఉండేందుకు ఎక్సలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నాం. నిర్ణీత కాలంలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తాం.