సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగమే దేశానికి రక్ష అని బుక్ ఫెయిర్ ప్రాంగణం అలిశెట్టి ప్రభాకర్ వేదికపై నిర్వహించిన చర్చాగోష్ఠిలో ప్రజాయుద్ధనౌక గద్దర్ అన్నారు. రాజ్యాంగమే దేశాన్ని నడిపిస్తున్నదని చెప్పారు. రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని పాటించాల్సిన అవశ్యకత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నదని హితవుపలికారు. సకల సంపదలు గల్ల దేశంలో దరిద్రం ఎట్లుందో నాయనా.. అంటూ పాటతో గద్దర్ ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ప్రజాసాహిత్యంపై గద్దర్తో డాక్టర్ కొండా నాగేశ్వర్రావు చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత వారాల ఆనంద్ పాల్గొన్నారు. గద్దర్ మాట్లాడుతూ.. భారతదేశం గొప్ప వైవిధ్యతను కలిగి ఉన్నదని, ఎన్నో మతాలు, కులాల ప్రజలు కలిసిమెలసి జీవనం కొనసాగిస్తున్నారని చెప్పారు. అదే వారసత్వం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. ప్రకృతిని తల్లీగా, స్త్రీగాను వర్ణిస్తూ సందర్భానుసారంగా తన పాటతో అందరినీ ఆలోచింపజేశారు. తర్వాత బుక్ ఎగ్జిబిషన్ను కలియదిరిగారు. అయన వెంట బుక్ ఫెయిర్ ఉపాధ్యక్షుడు కోయ చంద్రమెహన్ స్టాల్స్ వివరాలు, వారి ప్రాముఖ్యతను వివరించారు.
ఆధ్యాత్మిక పుస్తకాలకు వేదిక రామకృష్ణ మఠ్
వివేకానందుడి బోధనలు, రచనలు, ఆధ్యాత్మిక చింతన, సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు, యోగా, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన రామకృష్ణ పరమహంస బోధనలు లభిస్తున్నాయి. ఇక్కడ చిన్నారులకు 1 నుంచి 28 వరకు చిత్రాలతో కూడిన పుస్తకాలు లభిస్తాయి. కర్మ, జ్ఞాన, భక్తి, రాజయోగం లాంటి బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఆధ్యాత్మిక సాహితీ ప్రియులు ఈ స్టాల్కు పోటెత్తుతున్నారు.
బౌద్ధ సాహిత్యానికి నిలయం ప్రబుద్ధ భారత్
బౌద్ధ సాహిత్యానికి వేదికగా గోవిఅంస ప్రబుద్ధ భారత్ సాహిత్యం ఇక్కడ దొరుకుతుంది. త్రిపీఠకాలు, బుద్ధుడి బోధనలతో కూడిన అన్ని సాహిత్య పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అంబేద్కర్ రచనలు, భగవద్గీత, దమ్మ అండ్ బుద్ధ లాంటి అనేక బుక్స్ లభిస్తాయి. బుద్ధభూమి, ఆర్ట్స్ అండ్ లెటర్స్, జై భీమ్ బుక్స్ లాంటి స్టాల్స్ల్లో బుద్ధుడు, అంబేద్కర్, ఫూలే లాంటి బహుజన యోధుల పుస్తకాలు ఇక్కడ లభిస్తాయని గోవి అంస స్టాల్ నిర్వాహకుడు విశ్వనాథ్, తోకల సంజీవరెడ్డి, లియాకత్ అలీ బోధి తెలిపారు.