GHMC | సిటీబ్యూరో, మార్చి 3 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో నాలా అభివృద్ధి పనులు మూడు నెలలుగా నత్తనడకన సాగుతున్నాయి. హుస్సేన్సాగర్ వరద నీటి నాలా, బుల్కాపూర్ నాలా పనులతో పాటు శివారు మున్సిపాలిటీల్లో చేపట్టిన (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులు మధ్యనే నిలిచిపోయాయి. చేసిన పనులకు జీహెచ్ఎంసీ బిల్లులు చెల్లించడం లేదని, పెండింగ్ బిల్లులు ఇస్తేనే పనులు చేపడతామంటూ కొన్ని ప్రాంతాల్లో కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసినట్లు తెలుస్తున్నది.
మొన్నటి వరకు మందకొడిగా సాగిన పనులు.. ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడంలో ఆందోళన నెలకొన్నది. మరో మూడున్నర నెలల్లో వర్షాకాలం మొదలు కానున్నది. అప్పటి వరకు పనులు పూర్తికాకుంటే.. వరద ముంచెత్తే ప్రమాదం ఉంటుందని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.
2020 అక్టోబర్లో భారీ వర్షాలతో నగరాన్ని వరద ముంచెత్తింది. దీంతో ముంపు సమస్యకు శాశ్వత చర్యలు చేపట్టాలని భావించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం.. ఎస్ఎన్డీపీ తొలి విడత పథకం ద్వారా రూ. 985.45కోట్లతో 58 చోట్ల నాలా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. రూ.531కోట్లతో 35 ప్రాంతాల్లో వేలాది కాలనీలకు వరద ముంపు సమస్యకు పరిష్కారం చూపింది. అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎన్డీపీ పనుల పురోగతిపై సమీక్షించిన దాఖలాలు లేవు. ఖజానాలో డబ్బుల్లేక కాంట్రాక్టర్లకు చెల్లింపులను నిలిపివేశారు.
చాలా ప్రాంతాల్లో గోడలు, స్లాబుల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఫలితంగా రూ.394.65 కోట్లతో 20 చోట్ల జరుగుతున్న పనులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా వచ్చే వర్షాకాలం నాటికల్లా ఈ పెండింగ్ పనులు పూర్తి కాకపోతే సరూర్నగర్, నాగోల్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, చార్మినార్, చాంద్రాయణగుట్ట హయత్నగర్, వనస్థలిపురం, హబ్సిగూడ, ఉప్పల్ రామంతాపూర్తో పాటు శివారు ప్రాంతాలైన బడంగ్పేట, జల్పల్లి, పెద్ద అంబర్పేట, మీర్పేట ప్రాంతాల్లో తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.
కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో రూ.747.45కోట్లతో 37 చోట్ల పనులకు ఎస్బీఐ ద్వారా రూ. 515.96కోట్ల రుణం తీసుకోగా… మిగిలిన రూ. 231.81 కోట్ల నిధులను జీహెచ్ఎంసీ సమకూర్చాల్సి ఉంది. జీహెచ్ఎంసీ అవతల రూ. 238 కోట్లతో 21 చోట్ల జరిగే పనులకు శివారు మున్సిపాలిటీలు నిధుల భారం భరించాల్సి ఉంటుంది. మొత్తంగా నిధుల అడ్డంకితో నాలా అభివృద్ధి పనుల పురోగతి ప్రశ్నార్థకంగా మారింది.
చెరువుల పరిరక్షణకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. హుస్సేన్సాగర్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించేందుకు ప్రత్యేకంగా రూ.9.50 కోట్లతో వివిధ రకాల యంత్రాలను కొనుగోలు చేసేందుకు టెండర్లు పిలిచారు. ఈనెల 4వ తేదీలోగా ఆన్లైన్లో టెండర్లు సమర్పించాలని అధికారులు సూచించారు.