హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ బడులను సర్కారే తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. ఈ స్కూళ్లల్లోని విద్యార్థులపై తీవ్ర వివక్ష చూపుతున్నది. పదో తరగతి విద్యార్థులకు ఇచ్చే స్నాక్స్ విషయంలో తాజాగా పాఠశాల విద్యా శాఖ విడుదల చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. పీఎంశ్రీ స్కూళ్లల్లో 34 రోజులు స్నాక్స్ ఇవ్వాలని.. ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రం 19రోజులే ఇవ్వాలని ఆదేశించింది. విద్యాశాఖ ఇచ్చిన వివక్షాపూరిత ఆదేశాలపై టీచర్లు మండిపడుతున్నారు. ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్న విషయం తెలిసిందే.
విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయడంలో భాగంగా స్పెషల్ క్లాసులను నిర్వహిస్తుంటారు. వీటికి హాజరయ్యే విద్యార్థులకు విద్యాశాఖ ఉచితంగా స్నాక్స్ సమకూర్చడం ఆనవాయితీగా వస్తున్నది. తాజాగా పీఎంశ్రీ సూళ్లల్లోని విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు పాఠశాల విద్యాశాఖ అనుతిచ్చింది. ఈ బడుల్లో జనవరి 28 నుంచి మార్చి 10 వరకు మొత్తం 34రోజుల పాటు స్నాక్స్ను సమకూర్చాలన్నది. రాష్ట్రంలో 532 పీఎంశ్రీ స్కూళ్లున్నాయి. వీటిల్లో 46,221 మంది పదో తరగతి చదువుతున్నారు. సాయంత్రం స్పెషల్క్లాసులు నిర్వహిస్తున్నందున రూ.2.35 కోట్ల స్నాక్స్ బడ్జెట్ను కూడా సర్కారు మంజూరుచేసింది.
జిల్లా పరిషత్, ప్రభుత్వ, మాడల్ స్కూల్స్లోని విద్యార్థులకు స్నాక్స్ సమకూర్చేందుకు అనుమతినిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10 వరకు కేవలం 19 రోజులకు స్నాక్స్ను సమకూర్చాలని ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలో 4,303 స్కూళ్లల్లో 1,48,461 విద్యార్థులున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 చొప్పున 19 రోజుల పాటు సమకూర్చేందుకు స్నాక్స్ కోసం రూ.4.23 కోట్లను విద్యాశాఖ మంజూరు చేసింది. అయితే సౌకర్యాలు, నిధుల విడుదల విషయంలోనూ సర్కారు బడులకు ఒక విధంగా, పీఎంశ్రీ స్కూళ్లకు మరోలా విడుదల చేస్తున్నారని, ఇదే తీరును స్నాక్స్ విషయంలోనూ చూపడం అత్యంత దారుణమని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. స్నాక్స్ విషయంలో వ్యత్యాసం చూపడం తగదని తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజభాను చంద్రప్రకాశ్ అన్నారు.