కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 31 : తెలంగాణ రాష్ట్రంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) నేతలు దొంగల ముఠాగా మారి.. రాష్ర్టాన్ని భాగాలుగా మార్చుకుని కోట్లాది రూపాయలకు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్నారని.. అనాదిగా పార్టీకోసం కష్టపడి కోట్లాది రూపాయలు పోగొట్టుకున్న నేతలను నట్టేట ముంచారని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గొట్టిముక్కల వెంగళరావు ఆరోపించారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీలో 42 ఏండ్ల కిందట సామాన్య కార్యకర్తగా చేరానని.. పీజేఆర్ అడుగుజాడల్లో నడుస్తూ యూత్ కాంగ్రెస్, టౌన్ కాంగ్రెస్ విభాగాల్లో పనిచేసి పార్టీని బలోపేతం చేశానన్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూకట్పల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించానని.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించానన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు కూడా పార్టీని వదలకుండా పనిచేశానన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పొత్తులో భాగంగా స్థానికేతరులైన టీడీపీ అభ్యర్థిని బరిలోకి దింపినా.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఉమ్మడి అభ్యర్థి గెలుపు కోసం పని చేశానన్నారు. అనంతరం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి బలం లేకపోయినా పార్టీ అధిష్ఠానం సహకారం లేకున్నా డాక్టరైన తన కొడుకు విశ్వతేజరావును బరిలోకి దింపి పార్టీ ఓటు బ్యాంకును కాపాడేందుకు కృషి చేసినట్లు తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కోసం.. ఆదిలాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ సభ నుంచి ఇటీవల తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు నాలాంటి ఆశావహులంతా డబ్బులను ఖర్చు పెట్టి నాయకులను, కార్యకర్తలను తరలించి సభలను విజయవంతం చేసినట్లు తెలిపారు.
కాంగ్రెస్ బలోపేతం కోసం సొంత డబ్బులు ఖర్చుపెట్టి పనిచేసిన 75 శాతం నాయకులకు(ఆశావహులు) పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేతలు టికెట్లు ఇవ్వకుండా రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరంతా కలిసి ముఠాగా ఏర్పడి రాష్ర్టాన్ని భాగాలుగా చేసుకుని.. బిల్డర్లు, ఎన్ఆర్ఐలకు సీట్లను అమ్ముకున్నారని విమర్శించారు. ఈ ఎన్నికలు కూకట్పల్లి, శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో ఏండ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తనకు అన్యాయం జరిగిందని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దల చెంప చెళ్లుమనిపించేందుకే బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. బుధవారం సాయంత్రం కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం నుంచి వెయ్యి మంది అనుచరులతో ర్యాలీగా తరలివెళ్లి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. రేపటి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓడించడమే లక్ష్యంగా.. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లిలో అరికెపూడి గాంధీ గెలుపు కోసం తన అనుచరులతో కలిసి పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వతేజరావు, గురుమూర్తి, సంపత్రెడ్డి, బండారి ప్రవీణ్గౌడ్, రేష్మా, సంధ్యా, కల్పన, అశోక్ చారి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన గొట్టిముక్కల వెంగళరావు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. బుధవారం సాయంత్రం కూకట్పల్లి చిత్తారమ్మ దేవాలయం నుంచి ప్రగతిభవన్ వరకు భారీ ర్యాలీగా తరలివెళ్లి బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సమక్షంలో గొట్టిముక్కల వెంగళరావు వెయ్యి మంది అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కూకట్పల్లి డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేసిన విశ్వతేజరావుతో పాటు గురుమూర్తి, సంపత్రెడ్డి, బండారి ప్రవీణ్గౌడ్, రేష్మా, సంధ్య, కల్పన, అశోక్ చారి, ఉదయ్ తదితరులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.