మహేశ్వరం, ఆగస్టు 7: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు స్థానం లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గంగారం గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు గంగారం సర్పంచ్ సాలీ వీరా నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ నాయక్, గ్రామ శాఖ అధ్యక్షుడు పాండుల ఆధ్వర్యంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బీఆర్ఎస్ రాష్ట్రంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
కుల, మతాలకు అతీతంగా సంక్షేమ పాలన కొనసాగుతున్నదని మంత్రి అన్నారు. పార్టీలో చేరిన వారికి ఎల్లపుడు తగిన గుర్తింపు లభిస్తున్నదని అన్నారు. బీఆర్ఎస్ పాలన పేద ప్రజలకు శ్రీరామ రక్ష అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన వారు కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు దేవా నాయక్, కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాజు నాయక్, బీజేపీ వార్డు సభ్యుడు శంకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అంగోతు రాజు నాయక్, జిల్లా రైతు సమన్వయం సమితి నాయకుడు కూన యాదయ్య, శివగంగ దేవాలయ చైర్మన్ నిమ్మగూడెం సుధీర్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, రంగారెడ్డి జిల్లా కబడ్డీ చైర్మన్ మద్ధి కరుణాకర్ రెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ కడమోని ప్రభాకర్, నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, నవీన్, రవీందర్ నాయక్, ప్రవీణ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణలో అభివృద్ధి
బంజారాహిల్స్, ఆగస్టు 7: బీఆర్ఎస్ పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని, బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే పురోభివృద్ధి దిశగా రాష్ట్రం పయనిస్తున్నదని, దీనిని ప్రజలంతా బలంగా విశ్వసిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్కు చెందిన పలు బస్తీల నుంచి వివిధ పార్టీల్లో పనిచేసిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గులాబీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. పంజాగుట్ట ప్రతాప్నగర్, దేవరకొండ బస్తీ, గౌరీశంకర్ కాలనీ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 70మంది కార్యకర్తలు నాయకులు పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దేశంలోనే నెంబర్వన్గా నిలుస్తున్నదని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో మరోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్లో చేరిన పి.శోభ, రత్న, మమత, లక్ష్మి, బాలకృష్ణ, బబ్లూ, రాధ, శివ, గణేష్ పాల్గొన్నారు.
‘కాలేరు’ సమక్షంలో బీజేపీ నేతల చేరికలు
గోల్నాక: అంబర్పేట నియోజకవర్గంలో బీజేపీతో పాటు పలు పార్టీల నుంచి కీలక నేతల చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. తాజాగా సోమవారం గోల్నాక డివిజన్ క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ మోర్చ నగర ప్రధాన కార్యదర్శి ఇర్ఫానా సుల్తానా, బీజేపీ సీనియర్ నేత సునీల్ బాబు తదితరులు తమ నాయకులతో కలసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వీరికి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ మాట్లాడుతూ, అంబర్పేట నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. పార్టీలో కష్ట పడే ప్రతి నాయకుడికి తగిన ప్రాధన్యం ఇస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.