Hyderabad | సిటీబ్యూరో, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొన్నది. మొన్నటి దాకా అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారితే.. ఇప్పుడు రెబల్ బెడద ఆ పార్టీని వెంటాడుతున్నది. ముఖ్యంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంటున్న వేళ కాంగ్రెస్ పార్టీలో టికెట్ ఆశించి భంగపడిన నేతలంతా పట్టువీడడంలేదు. అభ్యర్థిని లెక్క చేయకుండా నామినేషన్ వేసి సవాల్ విసురుతున్నారు. కుక్కలు చింపిన విస్తరిలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారింది. అనడానికి మహేశ్వరం నియోజకవర్గంలో జరుగుతున్న వ్యవహారమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మొదట్నుంచి మహేశ్వరం నియోజకవర్గం టికెట్ నాదేనంటూ బడంగ్పేట మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి ప్రచారం చేసుకుంటూ వచ్చారు.
ఈ సమయంలోనే ఎమ్మెల్యే టికెట్ కోసం పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి కోట్లలో డబ్బులు ముట్టజెప్పానంటూ ప్రకటన ప్రకంపనలు సృష్టించాయి. సీటుకు నోటు పంచాయతీ తారాస్థాయికి చేరడం.. ఈ నియోజకవర్గం నుంచి ప్యారాచూట్ నేత కేఎల్ఆర్ను అధిష్ఠానం ప్రకటించడంతో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. నేటికీ నియోజకవర్గంలో మంటలు చల్లారడం లేదు. ఈ క్రమంలోనే డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి కేఎల్ఆర్కు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. చిగురింత పారిజాత నరసింహారెడ్డి దంపతులు మాత్రం అభ్యర్థిని ప్రకటించడంతోనే అయిపోలేదని, పార్టీ బీ ఫాం తనదేనంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
ఏకంగా ఢిల్లీలోనే మకాం వేసి బీ-ఫాం దక్కించుకునేలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో శనివారం ఏకంగా ఒక కార్పొరేటర్ చేత పారిజాత నామినేషన్ దాఖలు చేశారు. దీంతో పార్టీ క్యాడర్లో అమోమయ పరిస్థితులు నెలకొన్నాయి. అధిష్ఠానం కేఎల్ఆర్ను అభ్యర్థిగా ప్రకటిస్తే.. పారిజాత నామినేషన్ వేయడంపై విస్తృతంగా క్యాడర్ చర్చించుకుంటున్నారు. ఒకవైపు ఐటీ రైడ్స్, మరోవైపు పార్టీలో సమన్వయం లేమి.. అధిష్ఠానం పట్టించుకోకపోవడంతో క్యాడర్ ఆలోచనలో పడగా.. ఇందులో కొందరు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు చర్చ జరుగుతున్నది.