అమీర్పేట్, జనవరి 10 : సనత్నగర్లోని కేఎల్ఎన్ పార్కును మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆదేశించారు. ఇక్కడి కుంటలో సైక్లింగ్ బోటు, చక్కటి రంగులతో ఫౌంటెన్లను ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం పార్కు ఆవరణలో రూ. 90 వేలతో చేపడుతున్న తాగునీటి పైపులైను నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కు సుందరీకరణ చర్యల్లో భాగంగా కుంటలో ప్రస్తుతం నిల్వ ఉన్న నీటిని పూర్తిగా తొలగించి స్వచ్ఛమైన నీటితో నిండేలా చర్యలు చేపట్టాలన్నారు. పార్కులో శిథిలమైన టాయిలెట్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి, మాజీ కార్పొరేటర్ శేషుకుమారిలతో పాటు జీహెచ్ఎంసీ యూబీడీ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ మోహన్, పార్కు వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు షాబాద్ శ్రీనివాస్రావు, ప్రభాకర్రెడ్డి టీఆర్ఎస్ నాయకులు సురేశ్, కొలను బాల్రెడ్డి, రాజేశ్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానలు..
ప్రజలకు మరింత మెరుగైన వైద్యం కోసం నగరంలో సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ ఛాతి వైద్యశాలకు చెందిన విశాలమైన స్థలంతో పాటు అనేక ఇతర ప్రదేశాలను సూపర్ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణాల కోసం ఎంపిక చేశామన్నారు. సర్దార్ మన్మిత్సింగ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమీర్పేట్ గరుద్వారా సమీపంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ శిబిరంలో దాదాపు 300 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకుని మందులను ఉచితంగా పొందారని నిర్వాహకులు సర్దార్ కుల్వంత్సింగ్ తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శేషుకుమారి, సామాజిక సేవకులు కొత్తపల్లి మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు.