హిమాయత్నగర్, డిసెంబర్11: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఆటోలో తగినంత ప్రయాణికులు లేకపోవడంతో ఆటో డ్రైవర్ల ఆదాయానికి గండి పడుతోందని తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హిమాయత్నగర్లోని సత్యనారాయణరెడ్డి భవన్లో జేఏసీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ బి.వెంకటేశం, (ఏఐటీయూసీ) కో-కన్వీనర్ వి.కిరణ్(ఐఎఫ్టీయూ), బి.శ్రీకాంత్ (సీఐటీయూ),జి.మల్లేశ్గౌడ్(ఐఎన్టీయూసీ), సీహెచ్.బాల నరసింహ(బీఆర్టీయూ), మహ్మద్ అమనుల్లాఖాన్, ఎంఏ సలీం(ఆటో జేఏసీ), మీర్జా రఫత్ బేగ్(ఆటో ఓనర్స్ అసోసియేషన్) మాట్లాడారు.
ఇంధన చార్జీలు, రవాణా ట్యాక్స్ లు పెరిగినప్పటికీ ఆటో మీటర్ చార్జీలు పెంచకుండా ప్రయాణికులను వారి వారి గమ్యాలకు క్షేమంగా చేర్చడంలో ఆటో డ్రైవర్లు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ సరైన ఉపాధి అవకాశాలు లభించకపోవడంతో స్వయం ఉపాధి కోసం ఆటోలను కొనుగోలు చేసుకొని లక్షలాది మంది ఆటోలను నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో తమ బతుకు దెరువుపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల కుటుంబమంతా రోడ్డున పడాల్సి వస్తుందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి ఆటో డ్రైవర్లకు జీవనోపాధికి భరోసా కల్పించాలని కోరారు. రవాణా రంగ కార్మికులకు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆటో డ్రైవర్లకు నెలకు రూ.12 వేలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు మహ్మద్ అజీమొద్దీ,కొంరెల్లి బాబు, జంగయ్య, ఒమర్ఖాన్, ఎస్కే లతీఫ్, శ్రీను, ప్రవీణ్ పాల్గొన్నారు.