ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 13 : జాతీయ విద్యావిధానం ద్వారా సమగ్ర విద్యాభివృద్ధి జరుగుతుందని ఉస్మానియా యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ అన్నారు. బాలికా సాధికారత ద్వారానే దేశం ముందడుగు వేస్తుందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థుల కంటే విద్యార్థినుల సంఖ్య అధికమని అన్నారు. ‘ఎంపవరింగ్ స్కూల్ గర్ల్స్ ఆఫ్ తెలంగాణ.. రోల్ ఆఫ్ కేజీబీవీఎస్ ఇన్ ది లైట్ ఆఫ్ ఎన్ఈపీ – 2020’అనే అంశంపై ఓయూ ఎడ్యుకేషన్ కళాశాలలో ఒక్క రోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ వర్క్షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రవీందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్క్షాప్ కోఆర్డినేటర్, ఎన్సీటీఈ – ఎస్ఆర్సీ సభ్యుడు డాక్టర్ పి.శంకర్ మాట్లాడుతూ ఐసీఎస్ఎస్ఆర్ మంజూరు చేసిన ప్రాజెక్టులో భాగంగా తాము రాష్ట్ర వ్యాప్తంగా 54 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో (కేజీబీవీ) మూడు వేల మంది విద్యార్థులతో అధ్యయనం చేసి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే ముందు దానికి సంబంధించిన వారితో ఈ వర్క్షాప్ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
బాలికా సాధికారతకు కేజీబీవీలు ఎలా ఉపయోగపడుతున్నాయనే అంశంపై తాము లోతుగా అధ్యయనం చేశామని, పాఠశాలల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోవడం కొంత లోటుగా ఉందని అభిప్రాయపడ్డారు. లైబ్రెరీ, ల్యాబ్ల ఏర్పాటుతో పాటు శానిటరీ ప్యాడ్లను పంపిణీ చేయాలని, కాస్మొటిక్ చార్జీలు రెగ్యులర్గా అందజేయాల్సిన అవసరం ఉందన్నారు. వర్క్షాప్కు కేజీబీవీ విద్యార్థులు, అధ్యాపకులు, ప్రాజెక్టు ఆఫీసర్లు, డ్వాక్రా సంఘాల మహిళలు, ఆశా వర్కర్లు, వివిధ యూనివర్సిటీ అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, సమగ్ర శిక్షా అభియాన్ అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్ చంద్ర, ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్ డీన్ ప్రొఫెసర్ రాజేశ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్లు రఫీ మహమ్మద్, డాక్టర్ అనుగంటి సురేశ్, డాక్టర్ వివేక్వర్ధన్ పాల్గొన్నారు.