ఒకేసారి లక్ష సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ.. రాష్ట్రవ్యాప్తంగా ఏమూలకు ఘటన జరిగినా వెంటనే సమాచారమిచ్చే వ్యవస్థ.. అన్ని విభాగాలను సమన్వయం చేసే సిబ్బంది.. క్షణాల్లో స్పందించే డయల్ 100.. అత్యాధునిక పరిజ్ఞానంతో బంజారాహిల్స్ రోడ్నం.12లో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం 95 శాతం పూర్తయ్యింది. 5 టవర్లు.. రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ బాహుబలి కేంద్రాన్ని మూడు నెలల్లో ప్రారంభించే అవకాశం ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ తెలిపారు. డీజీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్, నగర సీపీ ఆనంద్తో కలిసి మంగళవారం కేంద్రాన్ని సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని, రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాల బిగింపు లక్ష్యం కాగా, ఇప్పటివరకు 9.2 లక్షల కెమెరాల ఏర్పాటు పూర్తయ్యిందన్నారు. అన్ని నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానిస్తున్నట్లు చెప్పారు. యురోపియన్ దేశాల్లోనే ఇలాంటి సెంటర్లు ఉంటాయని, దేశంలో ఇదే ప్రథమమని ఆయన వెల్లడించారు.
బంజారాహిల్స్, మే 10: దేశంలోనే ఎక్కడా లేని విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణ పనులు 95 శాతం పూర్తయ్యాయని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 580 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా బంజారాహిల్స్ రోడ్ నం. 12లో చేపట్టిన పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్రెడ్డి, అదనపు డీజీపీ జితేందర్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, పలువురు అధికారులు మంగళవారం సందర్శించారు. భవనంలో జరుగుతున్న పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ సీఈ గణపతిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీసు శాఖను పటిష్టం చేయడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు చేపట్టారని తెలిపారు.
ఏకకాలంలో లక్ష కెమెరాల ఫుటేజీని..
శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఇప్పటికే 9.2 లక్షల కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన అన్ని సీసీ కెమెరాలను బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఏకకాలంలో లక్ష కెమెరాలకు సంబంధించిన ఫుటేజీని పరిశీలించే అవకాశం ఉంటుందన్నారు. ఈ భవనంలో మొత్తం ఐదు టవర్స్ ఉన్నాయని తెలిపారు. టవర్- ఏలోని 20 అంతస్తుల బిల్డింగ్లో హైదరాబాద్ కమిషనర్ ఆఫీసుతో పాటు సంబంధిత విభాగాలు ఉంటాయని తెలిపారు. టవర్-బీలో 16 అంతస్తుల భవనంలో ఏర్పాటు చేస్తున్న టెక్నాలజీ ఫ్యూజన్ సెంటర్లో లక్ష సీసీ కెమెరాల ఫుటేజీ, సెన్సార్ల మానిటరింగ్, ఎమర్జెన్సీ మానిటరింగ్ వ్యవస్థ, డయల్ 100తో పాటు సీసీ కెమెరాల మానిటరింగ్, డాటా అనలైజింగ్ తదితర విభాగాలు పనిచేస్తాయని తెలిపారు. మల్టీ ఏజెన్సీ ఆపరేటింగ్ సెంటర్ కూడా ఇక్కడే కొనసాగుతుందని పేర్కొన్నారు. టవర్-సీ భవనంలో కాన్ఫరెన్స్ హాల్ ఉంటుందన్నారు. ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని మానిటర్ చేసేందుకు టవర్ డీ భవనంలోని 15, 16 అంతస్తుల్లో మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసుశాఖ పనితీరుతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల పనితీరును ప్రజలు తెలుసుకునేందుకు ఈ మ్యూజియం ద్వారా అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఐదో భవనంలో వార్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నామని, ముఖ్యమంత్రి, మంత్రులు, అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించేందుకు వీలుగా వార్రూమ్ సిద్ధం చేస్తామన్నారు.
రాష్ర్టానికి ఐకాన్..
తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను బలోపేతం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడటంలో పోలీసులు మంచి పనితీరును కనబరుస్తున్నారని ప్రశంసించారు. పోలీసు పనితీరుతో దేశవిదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ పనులు 95 శాతం పూర్తయ్యాయని తెలిపారు. మరో మూడునెలల్లో కమాండ్ కంట్రోల్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని చెప్పారు. మొత్తం రూ.580 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ భవన నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.450కోట్లు ఖర్చయ్యాయని వెల్లడించారు. దేశంలో ఏ నగరంలో ఇలాంటి కమాండ్ కంట్రోల్ భవనం లేదని, యూరోపియన్ దేశాల్లో మాత్రమే ఇలాంటి సెంటర్లు ఉన్నాయన్నారు. అత్యాధునిక టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ కమాండ్ కంట్రోల్ తెలంగాణ రాష్ర్టానికే ఐకానిక్గా మారుతుందన్నారు.