సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : పరిపాలన సౌలభ్యం కోసమే జీహెచ్ఎంసీ పరిధిలో వార్డు కార్యాలయాలు ప్రారంభించనున్నట్లు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని సుపరిపాలన వేడుకలో భాగంగా హెచ్ఐసీసీలో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమాన్ని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్ కుమార్ మాట్లాడుతూ.. జూన్ 16 నుంచి 150 వార్డు కార్యాలయాలను ప్రభుత్వం అమలులోకి తెస్తుందన్నారు. ప్రజా ఫిర్యాదులను 48 గంటల్లోపు పరిష్కరించాలని సూచించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు వార్డు కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 70 వేల జనాభాకు అనుగుణంగా ప్రభుత్వం నాలుగు అంచెల వార్డు వ్యవస్థను ప్రారంభిస్తుందన్నారు. సీడీఎంఏ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు పరిపాలన చేరువ కావడానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని అన్నారు. జలమండలి ఎండీ దానకిశోర్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఇంజినీరింగ్ చీఫ్ జియావుద్దీన్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్రెడ్డి, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి తదిరులు మాట్లాడారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ ప్రియాంక ఆల, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.